రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ .కె.ప్రత్యూష కుమారి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు తపాలా సేవకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.తపాలా శాఖ వారు న్యాయ సేవాధికార సంస్థలు అందిస్తున్న సేవలు మరియు నల్సా పథకాల గురించి ప్రజలలో విస్తృతంగా అవగాహన పెంచాలని కోరారు. ప్రజల సమస్యలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు మండల న్యాయ సేవా కమిటీల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలియజేయాలని కోరారు.ఈ సమావేశంలో పర్మనెంట్ లోక్ అదాలత్ ఛైర్మన్ ఏ.గాయత్రి దేవి పర్మనెంట్ లోక్ అదాలత్ ద్వారా ప్రజలు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో వారికున్న వివాదాలకు పరిష్కారం పొందవచ్చని తెలిపారు.అనంతరం న్యాయమూర్తి కే . ప్రత్యూష కుమారి స్థానిక గౌతమి జీవ కారుణ్య సంఘమును సందర్శించి వసతులను పరిశీలించారు. తర్వాత వృద్ధులతో మాట్లాడారు. వసతి గృహంలో వారికి ఎలాంటి అసౌకర్యం ఉన్నా తెలియ జేయాలని కోరారు. అర్హత ఉన్న వారికి పింఛన్ లేదా క్షేమ పథకాల లబ్ధి అందకపోయినా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు.
Prajavartha Online Telugu News