గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపుకు చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 10 వేల మొక్కలను నాటడానికి కార్యాచరణ సిద్దం చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వన మహోత్సవంలో భాగంగా గుంటూరు నగరంలో పచ్చదనం పెంపుకు వార్డ్ సచివాలయాల వారీగా 10 వేల మొక్కలను నాటడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశామని తెలిపారు. శుక్రవారం నగరంలోని వన మహోత్సవంలో భాగంగా గుంటూరు తూర్పు ఎంఎల్ఏ మహ్మద్ నసీర్ గారు నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ లోను, పశ్చిమ ఎంఎల్ఏ గల్లా మాధవి గారు శ్రీరామ్ నగర్ లోను మొక్కలను నాటారన్నారు. నగరంలో మొక్కల నాటడానికి పేరేచర్లలోని అటవీ శాఖ నుండి 10 వేల మొక్కలను తీసుకున్నామని, రోడ్ మార్జిన్లలో నాటడానికి వీలుగా 5 అడుగుల పైన ఉన్న 1000 మొక్కలను కడియం నర్సరీ నుండి తెప్పించామని తెలిపారు. ప్రదానంగా కాలనీల అంతర్గత రహదారులు, చెరువు కట్టలు, వాకింగ్ ట్రాక్ లు, కాలనీల్లోని ఖాళీ స్థలాలు, పార్క్ ల్లో మొక్కలను నాటేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగర ప్రజలు కూడా వన మహోత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి, వాటిని పరిరక్షించాలని, అప్పుడు పచ్చదనంతో నిండిన ఆరోగ్యకర గుంటూరు నగరం సాధ్యమవుతుందన్నారు.
Prajavartha Online Telugu News