– ఏ ఒక్కరూ మిగిలిపోకుండా వివరాల నమోదు
– ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వరద ప్రభావిత ప్రాంతాల్లోని ముంపు బాధితులు ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని.. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన స్పష్టం చేశారు.
విజయవాడ అర్బన్ పరిధిలో 32 వార్డులు, 179 సచివాలయాల పరిధిలో ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తిచేయడం జరిగింది. అయితే ఏ ఒక్క కుటుంబమూ ఎన్యూమరేట్ కాకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శించి, ఇంకా ఎవరైనా మిగిలియుంటే వారిని కూడా జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ సృజన ఆదివారం అజిత్ సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ 259 వార్డు సచివాలయాన్ని సందర్శించి అనంతరం రాజరాజేశ్వరిపేటలో పర్యటించారు. పలు అవకాశాలు ఇచ్చినప్పటికీ ఇంకా ఎవరైనా ఎన్యూమరేట్ కాకుండా మిగిలిపోతే వారి వివరాలను కూడా యాప్లో నమోదు చేసి జాబితాలో చేర్చే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా నష్ట వివరాల నమోదు చేయడ జరిగిందని.. అయితే ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని, సచివాలయాల్లో ఆదివారం జాబితాలను ప్రదర్శించినట్లు తెలిపారు. చాలామంది జాబితాలో పేరు ఉందా.. లేదా? అని తెలుసుకునేందుకు సచివాలయాలకు వస్తున్నట్లు వివరించారు. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపోయిన చివరి కుటుంబం వరకు పరిహారాన్ని అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మ్యాపింగ్ జరగకపోయినా నివాసం ఉంటున్నట్లు ఏ ఆధారం చూపినా వివరాలు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అంతేగానీ నోటిమాటగా ఇక్కడ ఉంటున్నాం, ఉంటున్నారు అని చెబితే సరిపోదని.. ఇలా చెప్పిన వారిని కూడా నమోదుచేస్తే నిజమైన లబ్ధిదారులకు నష్టం జరుగుతుందని వివరించారు. సోమవారం సాయంత్రం నాటికి ప్రక్రియను పూర్తిచేయడం జరుగుతుందని.. ముంపు బాధిత కుటుంబాలకు ఈ నెల 25న పరిహారం అందించడం జరుగుతుందని కలెక్టర్ సృజన తెలిపారు.
Prajavartha Online Telugu News