పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
పామర్రు నియోజకవర్గంలో మొవ్వ గ్రామం నందు జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించడానికి కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె.వి రామకృష్ణయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా ఉన్నది విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో నిలువ ఉంచిన సరుకుల పట్టిలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు అందించే ఆహార పదార్థాలలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని, ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు సకాలంలో మెనూ ప్రకారం అందించాలని, కాంట్రాక్టర్కు తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయులు ఏ విధంగా బోధిస్తున్నారు, ఉపాధ్యాయుల నుండి ఏమైనా వేధింపులు ఉన్నాయా అని విద్యార్థులను విడివిడిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రతినెల జిల్లాలో పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News