గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార వెంచర్లు, లే అవుట్స్ ఉండడానికి వీలు లేదని, అటువంటి వాటిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి తొలగిస్తామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఆదివారం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు ఆర్.టి.ఓ.ఆఫీస్ రోడ్, సీతయ్య డొంక రోడ్లలోని అనధికార లే అవుట్స్ లో ఏర్పాటు చేసిన హద్దు రాళ్లు, బోర్డ్ లు, రోడ్లను 3 జేసిబిలతో పూర్తి స్థాయిలో తొలగించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగర పరిధిలో దరఖాస్తు చేసిన లే అవుట్స్ కి నిర్దేశిత గడువులోగా తగిన అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. అనధికార వెంచర్లలో ప్లాట్ లు కొనుగోలు చేస్తే భవిష్యత్ లో జిఎంసి నుండి అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలుకావడం లేదని, ఫలితంగా మౌలిక వసతులు లేక ప్లాట్ ల కొనుగోలుదార్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజల నుండి ల్యాండ్ టైటిల్ వివాదాల పై పలు ఫిర్యాదులు అందాయన్నారు. నగర పాలక సంస్థ నుండి లే అవుట్స్అనుమతి పొందిన ఫ్లాట్ విక్రయదారులు లే అవుట్స్ అనుమతి వివరాలతో సమాచార బోర్డు లను ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లాట్ కొనుగోలుదారులు ముందుగానే సదరు లే అవుట్స్ కు నగర పాలక సంస్థ అనుమతులు ఉన్నది లేనిదీ పూర్తి వివరాలు తెలుసుకొని కొనుగోలు చేయాలన్నారు. అనధికార లే అవుట్స్ ల రిజిస్ట్రేషన్ నిలుపుదల పై డిస్ట్రిక్ట్ రిజిస్టార్ వారికి లేఖ పంపుతామన్నారు.
నగర పరిధిలో గుర్తించిన 40 అనధికార లే అవుట్స్ కు ఇప్పటికే నోటీసులు జారి చేసామని, ఆదివారం నుండి స్పెషల్ డ్రైవ్ మోడ్ లో తొలగించడానికి పట్టణ ప్రణాళిక అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సదరు లే అవుట్స్ లో చేపట్టిన రోడ్లు, హద్దు రాళ్లను తొలగిస్తామని, కనుక ఆయా లే అవుట్స్ యజమానులు తప్పనిసరిగా జిఎంసి నుండి తగిన అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News