మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రహదారుల మరమ్మత్తు, అభివృద్ధి పనులకు సంబంధించి నాణ్యత ప్రమాణాలతో మంచి నాణ్యతతో పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పల్లె పండుగ- ఎంజీఎన్ఆర్ఈజీఎస్-2024-25- సిమెంట్ రోడ్లు- నాణ్యత ప్రమాణాలు అవగాహన సదస్సు బుధవారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామాల్లో అన్ని రహదారులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం రహదారుల నాణ్యతకు ప్రాధాన్యతనిస్తోందన్నారు. నాణ్యత గల పనులను ఎగ్జిక్యూట్ చేయాలన్నారు. రహదారుల మరమ్మత్తులు, అభివృద్ధి పనులకు సంబంధించిన మెటీరియల్ నాణ్యతతో పాటు రహదారులు ఎక్కువ కాలం మన్నేలా నాణ్యతతో పనులు చేపట్టాలన్నారు. గుత్తేదారులు తీసుకువచ్చిన మెటీరియల్ నాణ్యతగా ఉందా లేదా పర్యవేక్షించాలన్నారు. చేస్తున్న పనులు నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు.
తొలుత ఏపీ ఆర్ ఆర్ పి ప్రాజెక్టు అడ్వైజర్ కే. ప్రభాకర్ రెడ్డి వివిధ కేటగిరీల రహదారులు, సీసీ రహదారులు, మెటీరియల్ నాణ్యత, పనుల నాణ్యత ప్రమాణాలు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వర్క్ షాప్ లో వివరించారు.
పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు, డ్వామా పీడీ ఎన్.వి శివప్రసాద్, పిఆర్ ఈఈ సుధాకర్ గౌడ్, పంచాయతీరాజ్ డిఈలు, ఏఈలు, ఉపాధి హామీ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News