-‘ పరిపాలనలో ఆర్థిక విశ్లేషణ సామర్థ్యం’పై జూలై 2, 3 తేదీల్లో తిరుపతిలో వర్క్ షాప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘స్వర్ణ ఆంధ్ర @ 2047’ విజన్ను సమర్థవంతంగా అమలు చేయడానికి, పరిపాలనలో డేటా ఆధారిత నిర్ణయాలు, సమర్థవంతమైన ప్రణాళిక, ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో “పరిపాలనలో ఆర్థిక విశ్లేషణ సామర్థ్యం” (Economic Intelligence of Governance) అనే అంశంపై రాష్ట్రస్థాయి సామర్థ్య పెంపుదల కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో జూలై 2, 3 తేదీల్లో తిరుపతిలోని తాజ్ హోటల్లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీయూష్ గోయెల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ వర్క్ షాపును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారన్నారు. అనంతరం వర్క్ షాపులో ‘స్వర్ణ ఆంధ్ర @ 2047’ లక్ష్యాల సాధనకు అవసరమైన కార్యాచరణపై మార్గనిర్దేశం చేస్తారన్నారు. ఈ రెండు రోజుల మేధోసదస్సులో పటిష్టమైన డేటా వ్యవస్థలు, మెరుగైన ప్రణాళికా విధానాలు, సమీక్షా వ్యవస్థలు, శాఖల మధ్య సమన్వయం, ఫలితాల ఆధారిత పరిపాలన, అభివృద్ధి లక్ష్యాల పర్యవేక్షణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు జరుగుతాయన్నారు.
ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు, ఈఏసీ-పీఎం (EAC-PM) చైర్మన్, నీతి ఆయోగ్, గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ శాఖల అధిపతులు పాల్గొంటారన్నారు.
భారత ప్రభుత్వ ప్రముఖుల ప్రసంగాలు, డేటా ఆధారిత పాలనపై నిపుణుల సూచనలు, అభివృద్ధి లక్ష్యాల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై జరిగే చర్చలు ‘స్వర్ణ ఆంధ్ర @ 2047’ విజన్ అమలుకు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీయూష్ గోయెల్ ఆ ప్రకటనలో తెలియజేశారు.
Prajavartha Online Telugu News