Breaking News

ప్రకృతితో కూడిన అభివృద్ధే శాశ్వతం

-కాంక్రీట్ జంగిల్ మధ్య ‘గ్రీన్ లంగ్స్’గా నగర వనాలు
-రూ. 36 కోట్ల వ్యయంతో 18 నగర వనాల అభివృద్ధి
-అటవీ సంపద, సాంప్రదాయాల కలబోతగా నిర్మాణం
-వినోదం, ఆరోగ్యం ఒకే చోట ఉండేలా ప్రత్యేక సౌకర్యాలు
-రాష్ట్ర వ్యాప్తంగా 18 నగర వనాలను వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘ఏ దేశమైతే ప్రకృతితో కలిసి ఎదుగుతుందో, ఆ దేశం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రకృతితో పాటు సాధించే అభివృద్ధే శాశ్వతంగా ఉంటుంది’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మన వారసత్వం అనేది కేవలం మనం నిర్మించిన కట్టడాలు కాకూడదని, మనం కాపాడిన ప్రకృతి అయి ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్టులను బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. వర్చువల్ గా ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, సవిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “నగరాలు, పట్టణాలు శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నగర వనాలు పట్టణాలకు గ్రీన్ లంగ్స్ లాగా పని చేస్తూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. కేంద్ర ప్రభుత్వ ‘నగర వన యోజన’ నిధులతో పాటు స్థానిక నిధులను సమకూర్చుకుంటూ రూ. 36 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును సిద్ధం చేశాం. ఒక్కో నగర వనాన్ని సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో, రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించాం. కొడూరు, కైలాసగిరి, మదనపల్లెలలో ప్రత్యేకంగా ఎర్రచందనం పరిరక్షణ పార్కులను ఏర్పాటు చేశాం. మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయ జ్ఞానాన్ని చాటి చెప్పేలా, జీవవైవిధ్య పరిరక్షణే ధ్యేయంగా నక్షత్ర వనాలు, రాశి వనాలను అభివృద్ధి చేశాం. ఈ పార్కులు కేవలం పచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా, ప్రజల శారీరక, మానసిక ఉల్లాసానికి కేంద్రాలుగా నిలవనున్నాయి. ఇందులో పక్షుల ఆవాసాలు, బోటింగ్, కయాకింగ్ (చిన్న పడవలు నడపడం), ట్రెకింగ్ పాయింట్లు, యోగా కేంద్రాలు, ఓపెన్ జిమ్‌లు వంటి ఎన్నో ప్రత్యేక ఆకర్షణలను అందుబాటులోకి తీసుకొచ్చాం.
• పచ్చదనాన్ని కాపాడుకుందాం
కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న ఆధునిక నగరాలలో, అలసిన మనుషులకు ఈ నగర వనాలు ప్రకృతిలోని ప్రశాంతతను పరిచయం చేస్తాయి. ఇవి కేవలం నేటి అవసరాల కోసమే కాదు, రాబోయే తరాల కోసం మనం అందిస్తున్న పచ్చని వారసత్వం. ప్రతి ఒక్కరూ వీటిని కాపాడుకుంటూ, మరింత పచ్చని, పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి’ అని పిలుపు నిచ్చారు.
• స్వయంగా పరిశీలించాను… నిజంగా అద్భుతం : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ “నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న నగర వనాన్ని స్వయంగా వెళ్లి పరిశీలించాను. పచ్చదనం, ప్రశాంతతో పాటు ఏర్పాటు చేసిన అత్యాధునిక వసతులు కుటుంబంతో కలిసి సమయం గడపడానికి ఎంతో అద్భుతంగా ఉన్నాయి. నగర వనానికి సమీపంలోనే ఉన్న గుట్టను, దానిపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ఈ పార్కుతో అనుసంధానం చేస్తే బాగుంటుంది. పార్కును, గుట్టను కలిపి ట్రెకింగ్ పాయింట్ గా అభివృద్ధి చేస్తే, అది నగరవాసులకు ఒక సరికొత్త ఆధ్యాత్మిక, సాహస పర్యాటక అనుభూతిని అందిస్తుంద”న్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి, గౌతు శిరీష, డా. బి.వి.జయనాగేశ్వర రెడ్డి, డా.పార్థసారధి, మహమ్మద్ షాజహాన్ బాషా, అటవీ పర్యావరణశాఖల ముఖ్య కార్యదర్శి  కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ పి.వి.చలపతిరావు, అటవీశాఖ సలహాదారు మల్లిఖార్జునరావు, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ ఎన్. నాగేశ్వరరావు, ఐ.టి. అడ్వైజర్ పి. నాగేశ్వరరావు, డి.సి.ఎఫ్. ఎ.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *