– నెల తొలిరోజే చేతికందుతున్న పెన్షన్ మొత్తం
– జిల్లాలో 2,25,214 మందికి రూ. 98.27 కోట్లు
– క్షేత్రస్థాయిలో పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సమ ప్రాధాన్యమిస్తూ స్వర్ణాంధ్ర దిశగా అడుగులేస్తోందని.. ఎన్టీఆర్ భరోసా పేదల గౌరవప్రద జీవితాలకు అండగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో బుధవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటివద్దే లబ్ధిదారులకు ప్రభుత్వ సిబ్బంది పెన్షన్ అందిస్తున్న తీరును పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా వివిధ కేటగిరీల కింద 2,25,214 మంది లబ్ధిదారులకు రూ. 98.27 కోట్ల మేర అందించడం జరుగుతోందన్నారు. పేద, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పెన్షన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, లబ్ధిదారుల్లో భరోసా, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సామాజిక భద్రతా కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రతి నెల మొదటి తేదీనే ఇంటి వద్దకే పెన్షన్ అందించే విధానంతో వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా, ప్రతి లబ్ధిదారునికి నిర్ణీత మొత్తాన్ని సకాలంలో అందించేలా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News