– దోషరహిత జాబితా లక్ష్యంగా సజావుగా సర్ ప్రక్రియ
– క్షేత్రస్థాయిలో బీఎల్ఏలు కూడా చేయూతనివ్వాలి
– ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో రెండు హెల్ప్ డెస్కుల ఏర్పాటు
– ప్రజలు బీఎల్వోలతో పాటు వీటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహిస్తూ దోషరహిత ఓటర్ల జాబితాను రూపొందించడం లక్ష్యంగా కృషిచేస్తున్నామని, ఈ బృహత్తర కార్యక్రమంలో రాజకీయ పార్టీలు కూడా భాగస్వాములై సహకరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు.
కలెక్టర్ లక్ష్మీశ శనివారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో సమగ్ర సవరణ ప్రక్రియ నేపథ్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సర్ ప్రక్రియ తీరుతెన్నులను కలెక్టర్ వివరించారు. 17,13,445 ఓటర్లకు గాను పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు, వాటి డిజిటైజేషన్ తదితరాలను వివరించారు. పార్టీల ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు https://voters.eci.gov.in/ వెబ్సైట్లో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ద్వారా 2002 ఎస్ఐఆర్ జాబితా నుంచి ఓటరు సమాచారం పొందే విధానాన్ని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. మ్యాపింగ్, ఎన్యూమరేషన్ ఫారాలు నింపే విధానంతో డిజిటైషన్ గురించి వివరించారు. ఓటర్లు ఫారాలు నింపడం, సమర్పించడంలో సహకరించేందుకు జిల్లాలోని 1,792 పోలింగ్ స్టేషన్ల పరిధిలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం, సందేహాల నివృత్తి కోసం ఈ హెల్ప్ డెస్కులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీఎల్ఏలు కూడా ప్రక్రియపై ఉన్న అవగాహనతో క్షేత్రస్థాయిలో సహాయసహకారాలు అందించాలన్నారు. ఓటు భద్రత కోసమే ఈ సర్ ప్రక్రియ చేపట్టడం జరిగిందని.. అర్హులైన ప్రతిఒక్కరూ జాబితాలో ఉండేలా స్వచ్ఛమైన జాబితా రూపకల్పనలో సహకరించాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. సమావేశంలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేసి.. వారి నుంచి సూచనలు స్వీకరించారు.
సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహంతో పాటు పి.హరికృష్ణ (ఏఏపీ), కాకాని తరుణ్ (భాజపా), పి.డేనియల్ (బీఎస్పీ), డీవీ కృష్ణ (సీపీఎం), వై.ఆంజనేయరెడ్డి, జి.సుందర్ పాల్ (వైఎస్ఆర్సీపీ) తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News