తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తోతాపురి మామిడి పండ్ల ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ నియమించిన నిపుణుల కమిటీ సభ్యులు గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్తో కలిసి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తోతాపురి మామిడి సాగు పరిస్థితులు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు), ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులు, ఉద్యానవన శాఖ అధికారులు మరియు ఇతర సంబంధిత వర్గాలతో పరస్పర చర్చలు నిర్వహించేందుకు 2026 జూలై 8, 9 తేదీల్లో కేంద్ర నిపుణుల కమిటీ తిరుపతి జిల్లాను సందర్శించింది.
నిపుణుల బృందంలో సభ్యులు డా. టి. దామోదరన్, డైరెక్టర్, ICAR-CISH, లక్నో డా. ఎం. శంకరన్, హెడ్, ఫ్రూట్ క్రాప్స్, ICAR-IIHR, బెంగళూరు
డా. హెచ్.ఎస్. సింగ్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ICAR-CISH, లక్నో శ్రీ సి.బి. హరినాథ రెడ్డి, అదనపు ఉద్యానవన సంచాలకులు, శ్రీ దేవముని రెడ్డి, సంయుక్త ఉద్యానవన సంచాలకులు, విజయవాడ సమావేశంలో జిల్లాలో తోతాపురి మామిడి సాగు విస్తీర్ణం, దిగుబడులు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, ధరలు తగ్గడానికి గల కారణాలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మామిడి కొనుగోలు, ప్రాసెసింగ్, ఎగుమతుల అవకాశాలు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిపుణుల కమిటీ సభ్యులు జిల్లా యంత్రాంగంతో సవివరంగా చర్చించారు.
జిల్లాలో తోతాపురి మామిడి సాగు పరిస్థితులు, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలు, మార్కెటింగ్ సదుపాయాలు, ధరల స్థిరీకరణకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులకు వివరించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన సూచనలు, సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ సమావేశంలో ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News