గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు మరో 3 రోజులే గడువు ఉన్నందున, ఎన్యూమరేషన్ ఫారాలు నింపి వెంటనే బిఎల్ఓలు లేదా వార్డ్ ల వారీ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ల్లో అందించాలని, లేకుంటే ఈ నెల 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు ఉండకపోవచ్చని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. శనివారం రైల్ పేట, వసంతరాయపురం, నగరంపాలెం ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో హెల్ప్ డెస్క్ ల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమ విజయవంతానికి వార్డ్ ల వారీగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 79, పశ్చిమ నియోజకవర్గంలో 80 హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి, సెలవు రోజుల్లో కూడా విధుల్లో ఉండేలా సిబ్బందిని కేటాయించామన్నారు. అలాగే ఒక్కో నియోజకవర్గానికి 14 ఆటోల ద్వారా మైక్ ప్రచారం చేస్తున్నామన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్న ఓటర్లు తమకు అందుబాటులో ఉన్న వివరాలు నింపి తక్షణం బిఎల్ఓలు లేదా సమీప పోలింగ్ కేంద్రాలు లేదా వార్డ్ ల్లో విస్తృతంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ల్లో అందించాలని కోరారు. సర్ కి ఈ నెల 14 వరకు గడువు ఉన్నప్పటికీ చివరి సమయంలో డిజిటైజ్డ్ చేయడానికి సర్వర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని, డిజిటైజ్డ్ చేయకుంటే ఈ నెల 21న వచ్చే ముసాయిదా జాబితాలో ఓటు ఉండకపోవచ్చని తెలిపారు. స్థానికంగా అందుబాటులో లేని వారు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ https://voters.eci.gov.in/ ద్వారా కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని ఆన్లైన్లో పూరించి సమర్పించవచ్చని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల బిఎల్ఏలు కూడా ఎన్యూమరేషన్ ఫారాలు నింపి, బిఎల్ఓలకు ఇచ్చేందుకు ఓటర్లకు సహకరించాలని సూచించారు. ఇప్పటికే బిఎల్ఓలు, సహాయక సిబ్బంది, సూపర్వైజరీ అధికారులు ఈ 3 రోజులు పూర్తి స్తాయిలో విధుల్లో ఉంటారని, ఏఈఆర్ఓలు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. ఎన్నికల విధులు అత్యంత ప్రాధాన్యతతో కూడినవని, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పర్యటనలో సూపర్వైజరీ అధికారులు హనీఫ్, కాశయ్య, బిఎల్ఓలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News