ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వాహన చోరుల‌ సింహస్వప్నం

-చోరీకి గురైన వాహ‌నాల ఆచూకి ప‌ట్టేస్త‌న్న కెమెరాలు
-గుంటూరులో ఒకే ఒక అలెర్టుతో 7 వాహ‌నాల స్వాధీనం
-ఎన్టీ ఆర్ జిల్లాలో మ‌రికొన్ని వాహ‌నాల గుట్టు విప్పిన సీసీటీవీలు
-నాలుగు నెల‌ల్లో 81 వాహ‌నాల రిక‌వ‌రీకి స‌హ‌కారం
-మిస్సింగ్ కేసుల ద‌ర్యాప్తుల్లోనూ దోహ‌ద‌ప‌డుతున్న ఏఐ ఆధారిత వ్య‌వ‌స్థ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల ఒక‌టో తేదీ.. బాప‌ట్ల జిల్లా చీరాల‌. చిత్తు కాగితాలు ఏరుకుని జీవ‌నం సాగించే త‌ల్లి. త‌న ఆరునెల‌ల చంటిబిడ్డ‌ను పొత్తిళ్ల‌లు పెట్టుకుని ఫుట్‌పాత్ మీద ఓ దుకాణం ముందు నిద్రిస్తోంది. తెల్ల‌వారు జామున ఆద‌మ‌రిచి నిద్రిస్తున్న స‌మ‌యంలో ఓ ఆగంతుకుడు ఆమె చంటిబిడ్డ‌ను ఎత్తుకెళ్లాడు. ఆమె క‌న్నీరు మున్నీరైంది. బాప‌ట్ల పోలీసులు ఈ కేసును స‌వాల్‌గా తీసుకున్నారు. బిడ్డ‌ను ఎత్తుకెళ్లిన నిందితుడ్ని ప‌ట్టుకోవ‌డానికి ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్య‌వ‌స్థ స‌హ‌కారం కోరారు. బిడ్డ‌ను ఎత్తుకెళ్లిన వ్య‌క్తి క‌ద‌లిక‌ల‌ను ఏఐ ఆధారిత కెమెరాల ద్వారా జ‌ల్లెడ‌ప‌ట్టి 24 గంట‌ల్లోపే నిందితుడ్ని ప‌ట్టుకునేలా ఆర్టీజీఎస్ రియ‌ల్ టైమ్ అలెర్టులను పోలీసుల‌కు పంపింది. అప‌హ‌ర‌ణ‌కు గురైన బాబును పోలీసులు తీసుకొచ్చి మ‌ళ్లీ ఆ త‌ల్లి ఒడికి చేర్చారు. బిడ్డ‌కోసం త‌ల్ల‌డిల్లిన ఆ త‌ల్లి మ‌ళ్లీ పొత్తిళ్ల‌లో త‌న బిడ్డ‌ను చూసి మురిసిపోయింది. ఆనందాశ్రువులు కార్చుతూ పోలీసుల‌కు చేతులు జోడించి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.
• గుంటూరు న‌గ‌రం ప‌ట్టాభిపురం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఇటీవ‌లే ఒక హోండా యాక్టివా స్కూట‌ర్‌ను దొంగ‌లు ఎత్తుకెళ్లారు. ఎంత అన్వేషించినా దొర‌క‌లేదు. చివ‌ర‌కు పోలీసులు ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్య‌వ‌స్థ స‌హ‌కారం కోరారు. పోలీసులు అందించిన ఆ వాహ‌నం వివరాల ఆధారంగా మ్యాట్రిక్ సీసీ కెమెరాల ద్వారా వాహ‌న క‌ద‌లిక‌ల‌ను అన్వేషించారు. జూన్ 17వ తేదీన ఆ స్కూట‌ర్ గుంటూరులోని ఓ ప్ర‌ధాన కూడ‌లి వ‌ద్ద తిరుగుతుండ‌గా పోలీసుల‌కు రిల‌య్ టైమ్ అల‌ర్టులు పంపారు. వెంట‌నే పోలీసులు నిందితుడ్ని ప‌ట్టుకుని విచారించ‌గా, ఆ స్కూట‌ర్‌తో పాటు మొత్తం ఏడు వాహ‌నాలు చోరీ చేసిన‌ట్లు చెప్ప‌డంతో ఆ వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకున్నారు.
సుర‌క్షిత ఏపీ సాధ‌న దిశ‌గా ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తెచ్చిన ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్య‌వ‌స్థ ప‌నితీరుకు పైరెండు సంఘ‌ట‌న‌లు ఒక చిన్న ఉదాహ‌ర‌ణ‌లు మాత్ర‌మ‌మే. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌ల‌కు , బ‌హుళ ప్ర‌యోజ‌నాల ఆశిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. వీటిని స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌)కు అనుసంధానం చేసి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. రాష్ట్రం వ్యాప్తంగా ప్ర‌స్తుతం 14,750 సీసీకెమెరాలున్నాయి. వీటిని ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్సు ఆధారితంగా ప‌నిచేసేలా ఆర్టీజీఎస్ సీసీటీవీ360 అనే వ్య‌వ‌స్థ‌ను రూపొందించారు. ఈ వ్య‌వ‌స్థ ఇప్పుడు పోలీసుల‌కు కేసుల ద‌ర్యాప్తులో అత్యంత స‌హాయ‌కారిగా, కీల‌క సాధ‌నంగా మారుతోంది. ప‌లు కేసులు చేధించ‌డంతో పోలీసుల‌కు కావాల్సిన సాంకేతిక స‌హ‌కారం అందిస్తోంది.
వాహ‌నాల దొంగ‌ల ఆట‌క‌ట్టు
వాహ‌నాల‌ను చోరీ చేసే దొంగ‌ల పాలిట ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్య‌వ‌స్థ ఇప్పుడు సింహ‌స్వ‌ప్నంలా మారుతోంది. రాష్ట్రంలో దొంగ‌లు ఎక్క‌డ వాహ‌నాల చోరీల‌కు పాల్ప‌డినా, ఆ వాహ‌న వివ‌రాల ఆధారంగా చోరీకి గురైన వాహ‌నాల‌ను సీసీకెమెరాల ద్వారా ఆర్టీజీఎస్ గాలించి, ఆ వాహ‌నాల ఆచూకీ గురించి పోలీసుల‌కు రియ‌ల్ టైమ్‌లో స‌మాచారం చేర‌వేస్తోంది. దీంతో ఈ కేసుల‌ను పరిష్క‌రించ‌డం పోలీసుల‌కు చాలా సుల‌భంగా మారుతోంది.
4 నెల‌ల్లో 80 వాహ‌నాల స్వాధీనం
ఆర్టీజీఎస్ సీసీటీవీ360 అందించిన ఏఐ ఆధారిత సాంకేతిక స‌హ‌కాం ద్వారా గ‌త నాలుగు నెల‌ల కాలంలో పోలీసులు 80కిపైగా చోరీకి గురైన వాహ‌నాల‌ను క‌నుగొని స్వాధీనం చ‌సుకోగ‌లిగారు. అదృశ్య‌మైన 73 మంది ఆచూకీని ఈ వ్య‌వ‌స్థ క‌నిపెట్ట‌గ‌లిగింది. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న 52 మంది నేర‌స్థుల ఆచూకీ కూడా క‌నుగొని వారిని పోలీసులు ప‌ట్టుకోవ‌డానికి దోహ‌ద‌ప‌డింది.
ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు
విజ‌య‌వాడ టు టౌన్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో త‌న వాహ‌నం చోరీకి గురైంద‌ని ఓ మ‌హిళ ఫిర్యాదు చేసింది. ఆ వాహ‌న ఆచూకీ కోసం ఆర్టీజీఎస్ సీసీటీవీ360 స‌హ‌కారాన్ని పోలీసులు కోరారు. దీంతో సీసీకెమెరాల ద్వారా ఆ వాహ‌న క‌ద‌లిక‌ల‌పై పోలీసుల‌కు ఆర్టీజీఎస్ ఎప్ప‌టిక‌ప్పుడు అల‌ర్టులు పంపడంతో ఆ వాహ‌నాన్ని ప‌ట్టుకోగ‌లిగారు. కుటుంబ త‌గాదాల కార‌ణంగా ఆమె భ‌ర్తే ఆ వాహ‌నాన్ని అప‌హ‌రించిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది.
నందిగామ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చోరీకి గురైన మోటారు సైకిల్‌ను చిల్ల‌క‌ల్లువ‌ద్ద ప‌టుకోగ‌లిగారు.
ఏ.ఎస్‌.న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోనూ ఇలాగే చోరీకి గురైన వాహ‌నాన్ని ఈ సాంకేతిక స‌హ‌కారంతో పోలీసులు ఇట్టే ప‌ట్టుకోగ‌లిగారు.
విస్స‌న్న‌పేట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఒక వాహ‌న చోరీ కేసు సుదీర్ఘ‌కాలం పెండింగులో ఉంది. ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్య‌వ‌స్థ ద్వారా పోలీసులు ఈ కేసును ఇటీవ‌లే ఇట్టే ప‌రిష్క‌రించ‌గ‌లిగారు. ఈ ప‌రిధిలోనే చోరీకి గురైన మరోవాహ‌నాన‌ని కూడా పోలీసులు ఇట్టే ప‌ట్టుకోగ‌లిగారు.
మ‌ద‌న‌ప‌ల్లె టూ ట‌వున్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో గ‌త ఏప్రిల్ 27న న‌మోదైన ద్విచ‌క్ర వాహ‌న చోరీ కేసును కూడా అక్క‌డి పోలీసులు ఆర్టీజీఎస్ సీసీటీవీ360 సాంకేతిక స‌హ‌కారంతో చేధించ‌గ‌లిగారు.
మిస్సింగ్ కేసుల్లోనూ
మ‌నుషుల అధృశ్యం కేసుల్లోనూ ఈ వ్య‌వ‌స్థ స‌మర్థ‌వంతంగా ప‌నిచేస్తోంది. మైల‌వ‌రం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఒక మ‌హిళ అదృశ్యం కేసు న‌మోదైంది. ఎంత గాలించినా ఆమె ఆచూకీ తెలీక చాలా కాలంగా ఆ కేసు పెండింగులో ఉంది. దీంతో పోలీసులు ఈ కేసు ప‌రిష్కారం కోసం ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్య‌వ‌స్థ స‌హ‌కారం అడిగారు. ఫేషియ‌ల్ రిక‌గ్న‌షిష‌న్ విశ్లేష‌ణ ద్వారా ఆ మ‌హిళ ఆచూకీని క‌నుగొని పోలీసుల‌కు అలర్టులు పంపారు. దీంతో పోలీసులు ఆమెను ప‌ట్టుకుని ఆమె కుటుంబ స‌భ్యుల చెంత‌కు చేర్చి ఈ కేసు ప‌రిష్క‌రించ‌గ‌లిగారు.
అదే రోజు ఎస్‌.ఆర్‌.పేట‌లో ఒక బాలిక అదృశ్య‌మైంద‌నే కేసు న‌మోదైంది. అదృశ్య‌మైన బాలిక ఆ చూకీని అదే రోజు కొన్ని గంట‌ల్లో క‌నుగొని ఆమెను ఆ కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించ‌డంలో ఈ వ్య‌వ‌స్థ స‌హ‌కార‌మందించింది.
రెడ్డిగూడెంలో కూడా ఇటీవ‌లే అదృశ్య‌మైన ఓ వ్య‌క్తి ఆచూకీని ఇలాగే క‌నుగొన‌గ‌లిగారు. అదృశ్యమైన వ్య‌క్తి వాహ‌న క‌ద‌లిక‌ల‌ను కెమెరాల ద్వారా ప‌సిగ‌ట్టి ఆయ‌న్ను క‌నుగొనేలా ఈ వ్య‌వ‌స్థ దోహ‌ద‌ప‌డింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *