-బల్లగరువు పర్యటన సందర్భంగా ఇచ్చిన మాట నిలుపుకొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-ఉపాధి నిధులతో అంగన్వాడీ కేంద్రాలతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజన గ్రామాల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ – అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, బల్లగరువు గ్రామ పర్యటన సందర్భంగా గిరిపుత్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, కోటి రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులు పూర్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, తాగునీటి సదుపాయం, సీసీ రోడ్లు తదితర వసతులు ఉపముఖ్యమంత్రిచొరవతో అందుబాటులోకి వచ్చాయి. గిరిజన గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు అనంతగిరి మండలం, బల్లగరువుకు వెళ్లారు. పర్యటనలో భాగంగా వెలగపాడు, కొరపర్తి తదితర గ్రామాల్లో గిరిజనులతో మమేకం అయ్యారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కార్యరూపం ఇస్తూ, నేడు పనులు పూర్తి చేశారు.
గిరిజన ప్రాంతాల్లో నివసించే మహిళలు, చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బల్లగరువు, వెలగపాడు, కొరపర్తి గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను నిర్మించారు. పవన్ కళ్యాణ్ ఆయా గ్రామాలను సందర్శించిన సమయంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు సరైన భవనం లేక చిన్నారులు పడుతున్న ఇబ్బందులు గుర్తించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో సమస్యలు తీర్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. చిన్నారులు, మహిళల కోరిక మేరకు మూడు అంగన్వాడీ భవనాలను రూ. 55 లక్షలు వెచ్చించి నిర్మించారు. అందులో బల్లగరువు, వెలగపాడుల్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో నూతన భవనాల నిర్మాణం చేపట్టారు. గిరిజనాభివృద్ధి శాఖ ఇంజినీరింగ్ విభాగం సహకారంతో కొరపర్తిలో అంగన్వాడీ భవనానికి ప్రహరీ గోడ, ఎంపీపీ స్కూలు భవనం పునరుద్ధరణ, తాగునీటి కోసం బోరు, నీటి సరఫరా నిమిత్తం పైపు లైన్లు, గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News