విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మెప్మా ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “మన డబ్బులు – మన లెక్కలు” మొబైల్ యాప్పై స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు అవగాహన కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 11వ డివిజన్లో కనకమేడల కళ్యాణ మండపంలో అవగాహన సమావేశం, ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మెప్మా స్టేట్ మిషన్ కో-ఆర్డినేటర్ జి. వెంకట నారాయణ మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా, సులభంగా నిర్వహించేందుకు “మన డబ్బులు – మన లెక్కలు” యాప్ను మెప్మా అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. సంఘాల ఆదాయం, వ్యయం, పొదుపు, రుణాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా లభిస్తుందని తెలిపారు. ప్రతి స్వయం సహాయక సంఘం సభ్యురాలు యాప్ను వినియోగించి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని సూచించారు.
అనంతరం నిర్వహించిన అవగాహన ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని డిజిటల్ ఆర్థిక నిర్వహణ, పొదుపు అలవాట్లు, పారదర్శక లెక్కల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సీడీఓ ఉమామహేశ్వరి, టీఈ శేఖర్, టీఈ నాగేంద్ర, కమ్యూనిటీ ఆర్గనైజర్లు (COలు), రిసోర్స్ పర్సన్లు (RPలు), స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News