విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలకు ఆరోగ్య భరోసా కల్పించే దిశగా విజయవాడ , పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలోని “సుజనా ఫౌండేషన్” నేతృత్వంలో గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా ఉచిత గుండె పరీక్షలు మరియు మాటర్నల్ కార్డియాక్ రిస్క్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా అందించడానికి సిద్ధమయ్యారు.
పశ్చిమంలో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి విడతల వారీగా ఉచిత ఆరోగ్య శిబిరాలను మరియు గర్భాశయ కాన్సర్ స్క్రీనింగ్ లను ఉచితంగా నిర్వహిస్తూ ఒక భారీ వైద్య విప్లవానికి నాంది పలికిన ఎమ్మెల్యే సుజనా చౌదరి మరో బృహత్తర కార్యక్రమం ద్వారా తల్లి మరియు పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ఉచిత హెల్త్ స్క్రీనింగ్ ల ద్వారా మహిళల గర్భధారణ సమయంలో వచ్చే గుండె జబ్బులు ముందుగానే గుర్తించి ప్రాణాంతక సమస్యలను నివారించడం సాధ్యమవుతుంది. పేద మహిళల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని , ఎటువంటి ఖర్చు లేకుండా అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలను వారి ముంగిటకే చేర్చాలని “సుజనా ఫౌండేషన్” లక్ష్యంగా పెట్టుకుంది.
గర్భిణీ స్త్రీల కోసం మొట్టమొదటిసారి ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం , చిట్టినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని )మరియు సహచర ఎమ్మెల్యేలు, ఎన్డీయే కూటమినేతలతో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి నేడు లాంఛనంగా ప్రారంభిస్తారని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం తెలియజేసింది.
రానున్న రోజుల్లో ఈ హెల్త్ చెకప్స్ ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించే దిశగా ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రణాళికలు సిద్ధం చేశారు.. మహిళలు, గర్భిణీ స్త్రీలు స్థానిక ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం తెలియజేసింది.
Prajavartha Online Telugu News