-తిమ్మరాజుపాలెం కోటసత్తెమ్మ అమ్మవారు, నిడదవోలు పట్టణంలోని మదన గోపాలస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దుర్గేష్
-సాంప్రదాయ పంచకట్టులో దర్శనమిచ్చిన మంత్రి దుర్గేష్.. శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులతో ఉత్సాహంగా గడిపిన మంత్రి దుర్గేష్..
-రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్.. శ్రీకృష్ణభగవానుడు, అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కాంక్షించిన మంత్రి దుర్గేష్
-నిడదవోలును నంబర్-1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడి
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శ్రావణ శుక్రవారం , శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని మంత్రి కందుల దుర్గేష్ తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ ఆలయాన్ని, నిడదవోలు పట్టణంలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ మదన గోపాలస్వామి వారి దేవస్థానాన్ని సందర్శించి అమ్మవారికి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేష్ పూర్తి తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ పంచకట్టులో ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణుడి వేషధారణలో అలరించిన చిన్నారులతో సరదాగా గడిపి ముచ్చటించారు. కోటసత్తెమ్మ ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరిస్తున్న మహిళా భక్తులను ఆప్యాయంగా పలకరించారు. అంతకుముందు ఆలయ అధికారులు, వేదపండితులు మంత్రికి ఘనస్వాగతం పలికి వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శాస్కి స్కీమ్ క్రింద అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ…పర్యాటక శాఖ మంత్రిగా వచ్చిన అవకాశంతో నిడదవోలు ప్రాంతాన్నిఅఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో అంతర్భాగం చేసి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో భక్తుల కోసం రూపుదిద్దుకున్న వసతి సౌకర్యాల నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని చెప్పారు.చినకాశీరేవులో ఘాట్ల ఆధునికీకరణ, శెట్టిపేట గోదావరి కెనాల్ నందు బోటింగ్, వేసైడ్ రెస్టారెంట్, ప్రజలు ఆహ్లాదంగా గడిపేలా ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.అమ్మవారి ఆశీస్సులతో నిడదవోలును రాష్ట్రంలోనే నంబర్-1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు.
“భగవద్గీత ద్వారా మానవాళికి కర్తవ్యాన్ని, అమూల్యమైన జ్ఞానాన్ని అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు. ఊరూరా భక్తిశ్రద్ధలతో జరుపుకునే కృష్ణాష్టమి వేడుకలు సమాజంలో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపుతాయి. శ్రీకృష్ణుని దివ్య ఆశీస్సులతో, కోటసత్తెమ్మ అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు నిండాలని, రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగాలని ప్రార్థించానని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ధర్మాన్ని రక్షించి, అధర్మాన్ని నశింపజేయడమే కృష్ణ తత్వమని, శ్రీకృష్ణ భగవానుడు చూపిన మార్గం సమాజానికి సర్వదా అనుసరణీయమని వివరిస్తూ రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్, కార్యనిర్వహణాధికారి (ఈవో), ఆలయ అర్చకులు, కూటమి నాయకులు,పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News