విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బహుజన ఉద్యోగుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ‘ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగ సంఘం’ ఏర్పడిందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.దినకర మూర్తి, ప్రధాన కార్యదర్శి లేళ్ల అంజయ్య వెల్లడించారు. ఏపీ బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఆదివారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ 2011 నుంచి బహుజన విద్యుత్ ఉద్యోగుల సంఘంగా కొనసాగుతున్న ఈ సంస్థ, ఇప్పుడు మరిన్ని విభాగాలను కలుపుకొని రాష్ట్ర స్థాయి సంఘంగా విస్తరించిందన్నారు. బహుజన ఉద్యోగుల సర్వీసు అంశాలు, బదిలీలు, పదోన్నతుల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడమే తమ సంఘం ప్రధాన లక్ష్యం అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగుల సమస్యలతో పాటు, సామాన్య ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ సంఘం శాఖలను విస్తృతం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కా కాంతారావు, ఉపాధ్యక్షులు ఎస్ రమణ, అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ సుందర రావు, జాయింట్ సెక్రటరీ నాగార్జున, ట్రెజరర్ పి చంద్రశేఖర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News