గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్దేశిత గడువు జూలై 14 కంటే ముందుగానే పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్ఓ), నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బిఎల్ఓలు, సూపర్వైజరీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆర్టీసి కాలనీ, మోతీలాల్ నగర్, తారకరామ నగర్ తదితర ప్రాంతాల్లో ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని గడువులోగా పూర్తి చేసేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను పక్కాగా నిర్వహిస్తూ, ఓటర్ల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి ఫారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) బీఎల్వోలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఓటర్లు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా, 2002 సంవత్సరంలో ఓటరు నమోదుకు సంబంధించిన వివరాలు ఉంటే వాటిని సిద్ధంగా ఉంచుకోవాలని, లేకపోతే తల్లిదండ్రులు లేదా అవ్వ, తాత, నాన్నమ్మలలో ఎవరిదైనా ఓటు ఏ రాష్ట్రం, నియోజకవర్గం, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్లో నమోదై ఉందో ఆ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. సూపర్వైజరీ అధికారులు, ఏఈఆర్ఓలు తప్పనిసరిగా ప్రతి రోజు తమ పరిధిలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఉండాలని, ఎక్కడైనా బిఎల్ఓలు నిర్దేశిత విధుల్లో లేకుంటే చర్యలకు సిఫార్స్ చేయాలని స్పష్టం చేశారు.
అనంతరం మోతీలాల్ నగర్, తారకరామ నగర్ ల్లో డ్రైన్లు అపరిశుభ్రంగా ఉండడంపై సంబందిత శానిటరీ ఇన్స్పెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసి, తక్షణం శుభ్రం చేయాలని ఆదేశించారు. పారిశుధ్య పనులపై అధిక దృష్టి సారించాలని, నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పర్యటనలో సూపర్వైజరీ అధికారులు సాధిక్ పాషా, జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News