-ప్రపంచ జూనోసిస్ దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-జూలై 6న ఉచిత రేబీస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం
-ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జూలై 6న ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పశువైద్యశాలల్లో ఉచిత రేబీస్ టీకాల కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 జూలై 6న ఎన్టీఆర్ జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, ఎన్టీఆర్ జిల్లా తెలిపారు.
జంతువుల నుండి మనుషులకు, అలాగే మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అని పిలుస్తారని, వాటి నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రేబీస్ వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 2026 జూలై 6న ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పశువైద్యశాలల్లో పెంపుడు కుక్కలకు ఉచిత రేబీస్ నిరోధక టీకాలు వేయనున్నట్లు తెలిపారు.
జిల్లాలోని అన్ని పెంపుడు కుక్కల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమీప పశువైద్యశాలకు పెంపుడు కుక్కలను తీసుకువచ్చి ఉచిత రేబీస్ టీకాలు వేయించుకోవాలని కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, ఎన్టీఆర్ జిల్లా విజ్ఞప్తి చేశారు.
రేబీస్ వంటి జూనోటిక్ వ్యాధులను నివారించడంలో సకాలంలో టీకాలు వేయించడం అత్యంత ప్రభావవంతమైన చర్య అని, ప్రజారోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.
“ఆరోగ్యకరమైన జంతువులు – ఆరోగ్యకరమైన మనుషులు – ఆరోగ్యకరమైన పర్యావరణం” అనే One Health సూత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి జూనోటిక్ వ్యాధుల నివారణకు సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా. చంద్రశేఖరరావు, డా. సునంద, డా. మనోజ్, డా. పంకజ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News