విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముత్యాలంపాడులోని లోకరాజు గంగరాజు కళ్యాణ మండపంలో శనివారం శ్రీ అల్లూరి సీతారామరాజు సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అల్లూరి సీతారామరాజు 129వ జయంతి ఉత్సవాల్లో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన బోండా ఉమా గారు, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు ధైర్యసాహసాలు, త్యాగనిరతి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశభక్తి, సేవాభావంతో సమాజం కోసం పనిచేయడం ద్వారా ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను ఘనంగా సన్మానించారు. వారిలో ప్రముఖ సినీ హీరో టి. సుమన్ , వాలీబాల్ విభాగంలో అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎ. రమణరావు, ప్రముఖ సంఘసేవకులు చలవాది మల్లికార్జున రావు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మాతంగి రత్న కమల్బాబు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News