విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలూరులో నిర్వహించిన దళిత శంఖారావం సభలో మాజీ మెజిస్ట్రేట్ జడ శ్రవణ్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు సోమవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్క్లబ్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర దళిత సేన ఫౌండర్ హమారా ప్రసాద్, హిందూ జనశక్తి ఫౌండర్ లలిత్ కుమార్ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డిప్యూటీ స్పీకర్తో పాటు హిందూ సంఘాల నాయకులను శ్రవణ్ అభ్యంతరకరంగా దూషించారని వారు ఆరోపించారు. రాష్ట్రంలో కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆయన ప్రసంగాలు ఉన్నాయని విమర్శించారు. రాజ్యాంగంలో లేని దళిత క్రైస్తవ అనే పదాన్ని వాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని దుయ్యబట్టారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్ర పన్నుతున్న జడ శ్రవణ్ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాల నాయకులు పోతురాజు, కిల్లి భాస్కర్, రామరాజు, సాయిరామరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News