-బాల కార్మిక నియంత్రణ చట్టం 1986 ను సమర్థవంతంగా అమలు చేయండి
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
14 ఏళ్ళలోపు బాలలతో పని చేయిచుకునేవారిపై బాల కార్మిక నియంత్రణ చట్టం 1986 కింద కేసులు నియంత్రించి శిక్ష విధించిన్నప్పుడే బాలల భవితను కాపాడుతామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.బాల కార్మికుల చట్టం అమలుపై సంబంధిత అధికారులతో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా రూపొందించడంలో అధికారులు సమర్థవంతంగా కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం 1986లో చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందన్నారు. 14 సంవత్సరాల లోపు బాల బాలికలను పనిలో పెట్టుకుని పనులు చేయిస్తే అటువంటి వారిపై బాలకార్మిక నిషేద చట్టం సెక్షన్ 14 (1) కింద కేసు నమోదు చేస్తే 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 20 వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. 15 సంవత్సరాలు నుండి 18 సంవత్సరాల వయసు గల బాల బాలికలతో గనులు, ప్రమాదకరమైన పరిశ్రమలు, మండేస్వభావంగల పద్దార్థల వినియోగ కేంద్రాలలో పని చేయిస్తే చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రేగ్యులేషన్ చట్టం 1986 సవరణ చట్టం 2016 మరియు రూల్స్ 2017 కింద కఠిన శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఈనెల 30వ తేది వరకు కార్మిక, పోలీస్, రెవెన్యూ, చైల్డ్లైన్, స్వచ్చంద సంస్థల ప్రతినిధుల టాస్క్ఫోర్స్ బృందం జిల్లాలో బాల కార్మికులను గుర్తించి, యాజమానులపై కేసులను నమోదు చేయాలన్నారు. బాలలతో పనిచేయిస్తున్న ప్రదేశాలను గుర్తించి సంబంధిత సాక్ష్యాధారాలను ముందుగానే సేకరించి క్షేత్రస్థాయిలో పని చేస్తున్న సమయంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించి యాజమానులపై కేసు నమోదు చేసి శిక్ష పడేలా చేయగలిగితే బాలలతో పని చేయించుకునేవారిలో భయం, మార్పులను తీసుకురాగలుగుతామని తద్వారా బాలకార్మిక వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు అవకాశం ఉంటుందన్నారు. బాలలతో పనిచేయిస్తున్నట్లు గమనిస్తే చైల్డ్లైన్ 1098కి సమాచారం అందించేలా ప్రజలలో చైతన్యం తీసుకురావాలన్నారు.ముఖ్యంగా ఇటీవల పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన తర్వాత 14 సంవత్సరాల్లోపు బాల బాలికలు కొన్ని దుకాణాలలో పనిచేస్తున్నట్లు కార్మిక శాఖ అధికారుల వద్ద సమాచారం ఉన్నట్లు ఇటీవల జరుగుతున్న కొన్ని దాడులు తెలుపుతున్నాయి. బాల కార్మికులతో పని చేయించుకుంటున్న యజమానులు ఇప్పటికైనా బాల కార్మికులతో పని చేయించుకోవడం నేరమని గ్రహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాల కార్మికుల పేదరికాన్ని, తల్లిదండ్రుల అసహాయతను అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్న యజమానులు జైలుకు వెళ్లడం ఖాయమని, జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు హెచ్చరించారు.
Prajavartha Online Telugu News