Breaking News

అభివృద్ధి పనులు నిర్దేశిత షెడ్యూల్ మేరకు పూర్తి చేసేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అగ్రిమెంట్ ప్రకారం అభివృద్ధి పనులు నిర్దేశిత షెడ్యూల్ మేరకు పూర్తి చేసేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, పాట్ హోల్స్ మరమత్తులకు తగిన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ గారు స్థానిక రత్నపురికాలని, మల్లికార్జునపేట, శారదాకాలనీ ఎక్స్ టెన్షన్, బొంగరాలబీడు గ్యాస్ దహనవాటిక, సంజీవయ్య నగర్, రత్నగిరి నగర్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, రోడ్ల ఆక్రమణలు, గోరంట్లలో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు తొలుత మల్లికార్జున పేట, రత్నపురికాలనీ, శారదా కాలనీ ఎక్స్ టెన్షన్ లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల వారీగా ఇంజినీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని, టెండర్ ద్వారా పొందిన పనులు వెంటనే ప్రారంభించాలని, పనులు ప్రారంభించని కాంట్రాక్టర్ల వివరాలు ఇవ్వాలన్నారు. పనులు జాప్యం జరిగితే ప్రజలు అసౌకర్యానికి గురవుతారని, ఇంజినీరింగ్ అధికారులు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మలికార్జునపేటలో నివాసాల మధ్య గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉండడం గమనించి, సంబందిత శానిటరీ ఇన్స్పెక్టర్, కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. రత్నపురి కాలనీలో అవుట్ ఫాల్ డ్రైన్ వ్యర్ధాలతో ఉండడం చూసి వెంటనే సిల్ట్ కార్మికుల ద్వారా తొలగించాలని ప్రజారోగ్య అధికారులను, డ్రైన్ పై ఆక్రమణలను తొలగించాలని పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించారు. బొంగరాలబీడు మహా ప్రస్థానంలో 14 ఫైనాన్స్ నిధులతో నిర్మాణం చేసిన గ్యాస్ దహనవాటికను పరిశీలించి, వినియోగంలోకి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏఈని ఆదేశించారు. సంజీవయ్య నగర్ రైల్వే ట్రాక్ దగ్గర రోడ్ ఆక్రమణలను తొలగించడం, పెండింగ్ విస్తరణ పనులు పూర్తి చేయాలని పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గోరంట్లలో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసిన భవనాలను పరిశీలించి, నిర్మాణదారులు నిబందనల మేరకు నిర్మాణాలు చేసుకోవాలని, నిబందనలు పాటించని వాటికి తదుపరి అనుమతులు జారీ చేయడం నిలిపివేస్తామన్నారు.
అనంతరం పెద్దపలకలూరు రోడ్ లోని రత్నగిరి నగర్ లో త్రాగునీటి సరఫరాపై స్థానికుల ఫిర్యాదు మేరకు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పర్యటించి, స్థానికులతో మాట్లాడి, గత వారం రోజుల నుండి పైప్ లైన్ ద్వారా త్రాగునీటి సరఫరా జరగడం లేదని స్థానికులు తెలపగా తక్షణం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మోటార్ల సమస్య వలన రత్నగిరి నగర్ కి త్రాగునీటి సరఫరా నిలిచిందని తెలిపిన అధికారులపై అసహనం వ్యక్తం చేసి, త్రాగునీటి సరఫరాపై ఫిర్యాదులను ఇంజినీరింగ్ అధికారులు శ్రద్ధ పెట్టాలని, మోటార్లు శుక్రవారం సాయంత్రానికి మరమత్తు చేసి సరఫరా ఇవ్వాలని స్పష్టం చేశారు. అప్పటి వరకు ట్యాంకర్లు ద్వారా సరఫరా చేయాలన్నారు. ట్యాంకర్ల డ్రైవర్లు డబ్బులు అడుగుతున్నారని స్థానికులు తెలపగా అటువంటి వారి పై క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలని డిఈఈని ఆదేశించారు.
పర్యటనలో డిప్యూటీ మేయర్ వి.బాలవజ్రబాబు, ఈఈ కోటేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శోభారాణి, ఎంహెచ్ఓ రామారావు, డిసిపి సూరజ్ కుమార్, ఏసిపిలు, ఆర్.ఓ.లు, డిఈఈలు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Check Also

స్వచ్చంద సంస్థలు యాంటి బర్త్ కంట్రోల్ (ఏబిసి)కి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు స్వచ్చంద సంస్థలు యాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *