-పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం మరియు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అభివృద్ధి పనుల పురోగతిపై పూర్తి స్థాయిలో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, రాజమహేంద్రవరం పీఆర్ఐ డివిజన్ పరిధిలో వివిధ పథకాల కింద చేపట్టిన పనులపై పనుల వారీగా సమీక్షించి, తక్షణం పూర్తి చేయాలని సూచించారు. “జిల్లాలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో మొత్తం 922 పనులు రూ.238.14 కోట్లు అంచనా వ్యయంతో మంజూరయ్యాయన్నారు. ఇప్పటి వరకు 47 పనులు పూర్తికాగా, 68 పనులు కొనసాగుతున్నాయి, ఇంకా 808 పనులు ప్రారంభించాల్సి ఉన్నాయన్నారు. నిర్మించిన రహదారుల నాణ్యతపై తప్పనిసరిగా ఆడిట్ నిర్వహించాలి. భారీ వాహనాల రాకపోకలు ఉన్న ప్రాంతాల్లో బలమైన, దీర్ఘకాలిక రహదారులను నిర్మించాలని తెలిపారు.
జిల్లాలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY – Phase III) పథకం కింద రూ.7.12 కోట్ల వ్యయంతో రెండు పనులు మంజూరై, అందులో ఒకటి పూర్తై, మరొకటి పురోగతిలో ఉందని చెప్పారు.
నాబార్డ్ (RIDF) పథకం కింద రూ.24.62 కోట్లతో 13 పనులు మంజూరై, వాటిలో 10 పనులు కొనసాగుతుండగా 3 పనులు ప్రారంభించాల్సి ఉన్నాయని తెలిపారు.
APRRP (AIIB) పథకం కింద రూ.45 కోట్ల వ్యయంతో ఒక పని మంజూరై ప్రస్తుతం పురోగతిలో ఉందని తెలిపారు.
గోపాలపురం నియోజకవర్గ పరిధిలో 7 సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు మరమ్మతుల కింద రూ.1.24 కోట్లతో 7 పనులు మంజూరై, వాటిలో 3 పూర్తయ్యాయి, 3 పనులు కొనసాగుతుండగా 1 ప్రారంభ దశలో ఉందని వివరించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS 2025-26) కింద 869 పనులు రూ.152.05 కోట్లు వ్యయంతో మంజూరై, వాటిలో 32 పూర్తయ్యాయని, 51 పురోగతిలో ఉండగా, 786 పనులు ప్రారంభించాల్సి ఉన్నాయని తెలిపారు.
ఎంపీల్యాడ్స్ (18వ లోక్సభ) పథకం కింద 22 పనులు రూ.6.25 కోట్లు వ్యయంతో మంజూరై, అందులో 2 పూర్తయ్యాయని, 2 పనులు కొనసాగుతుండగా 18 ప్రారంభ దశలో ఉన్నాయని పేర్కొన్నారు.
జిల్లా మినరల్ ఫండ్ (DMF) కింద 8 పనులు రూ.1.85 కోట్లు వ్యయంతో మంజూరై, అన్ని పనులు పూర్తయ్యాయని వివరించారు.
కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులు పనులను సమయపాలనతో, నాణ్యత ప్రమాణాలకు లోబడేలా పూర్తి చేయాలని సూచించారు. “గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారుల మెరుగుదల, పారిశుధ్యం మరియు సంక్షేమ రంగాల బలోపేతం ఈ పథకాల ప్రధాన లక్ష్యం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి కే. బాలకృష్ణ, డ్వామా ఏపీడి బి. రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News