రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఈరోజు రాజమహేంద్రవరం నగరంలో విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొని వ్యవసాయ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, దేశాభివృద్ధి లక్ష్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
మొదటగా, ICAR – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పీవీఎన్ మాధవ్, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత, పరిశోధనల ప్రాముఖ్యత, రైతుల ఆదాయ పెంపు, వాణిజ్య వ్యవసాయ అభివృద్ధి వంటి అంశాలపై శాస్త్రవేత్తలు, నిపుణులతో చర్చించారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు దేశ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు.
అనంతరం రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్లో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మరియు పోస్టల్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన “లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ పథకాల రిజిస్ట్రేషన్” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు నమోదు ప్రక్రియ నిర్వహించారు.
ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా అమలవుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా రాజమహేంద్రవరం నగరంలో నిర్వహించిన విశిష్ట వ్యక్తుల సమావేశంలో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మహిళా సాధికారత, రైతు సంక్షేమం వంటి అంశాలను వివరించారు.
అలాగే, “వికసిత్ భారత్ – 2047” లక్ష్య సాధనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, పోస్టల్ శాఖ అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News