విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని బుడమేరు కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రపుడెక్క తొలగింపు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. గురువారం ఉదయం సర్కిల్-2 పరిధిలోని 30వ డివిజన్ రామకృష్ణపురం వద్ద బుడమేరు కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రపుడెక్కను తొలగించేందుకు లాంగ్ ఆర్మ్, ట్రక్సర్, బోట్లను వినియోగిస్తూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు.
వర్షాకాలంలో కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పనులు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. కాలువల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, జల మొక్కలను పూర్తిస్థాయిలో తొలగించడం ద్వారా నీటి ప్రవాహం మెరుగుపడి, వరద ముప్పు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
నగరంలోని ప్రధాన కాలువలు, డ్రైన్లు, అవుట్ఫాల్ డ్రైన్లలో ఇలాంటి ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News