-కడప కలెక్టర్ కు, డీఎంహెచ్ వోకు జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కలుషిత ఆహారం కారణంగా రిమ్స్ మెడికల్ హాస్టల్ విద్యార్థినులు అస్వస్థత గురికావడంపై జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థినుల ఆర్యోగంపై ఆరా తీస్తూ, మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ చెరకూరి శ్రీధర్ ను, డీఎంహెచ్ వో డాక్టర్ రవి రాథోడ్ ఫోన్లో ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. నగరంలోని రిమ్స్ ఆసుపత్రికి చెందిన మెడికల్ హాస్టల్ విద్యార్థినులు కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురి కావడంపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా కలెక్టర్ చెరకూరి శ్రీధర్ ను, డీఎంహెచ్ వో డాక్టర్ రవి రాథోడ్, రిమ్స్ ఆసుప్రతి సూపరింటెండెంట్ తోనూ ఫోన్లో మాట్లాడారు. విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంపై నివేదికివ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, రిమ్స్ లో ఉంచే వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి సవితకు జిల్లా కలెక్టర్ చెరకూరి శ్రీధర్, డీఎంహెచ్ వో డాక్టర్ రవి రాథోడ్ వివరించారు. బుధవారం రాత్రికి కొందరిని డిశ్చార్జి చేసే ఆలోచన చేస్తున్నామని, శారీరకంగా బలహీనంగా ఉన్న విద్యార్థినులకు వైద్య సేవలు అందించనున్నామని తెలిపారు. ఈ సందర్బంగా మంత్ర సవిత స్పందిస్తూ, విద్యార్థినులకు నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, మెరుగైన వైద్య సేవలందించాలని మంత్రి సవిత ఆదేశించారు. విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యం చూపితే సహించేది లేదన్నారు. హాస్టల్ లో మిగిలిన విద్యార్థినులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని, తాజా ఆహారంతో పాటు వేడి చేసి చల్లార్చిన నీటి మాత్రమే అందించాలని స్పష్టం చేశారు. వాతావరణంలో మార్పులు దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు.
Prajavartha Online Telugu News