-సీఎం చంద్రబాబు నాయుడు, సహచర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి డిఎస్ బీవీ స్వామి
-ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్ తో పాటు ఐఐటీ, నీట్, జేఈఈ కి ఉచిత శిక్షణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సాంఘిక సంక్షేమ ఆధ్వర్యంలో మూడు ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సహచర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి డా.స్వామి మాట్లాడుతూ…సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా మధురవాడ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోటలో ఎక్సలెన్సీ సెంటర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయనున్నాం. ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్ తో పాటు ఐఐటీ, నీట్, జేఈఈ కి ఉచిత శిక్షణ అందిస్తాం. ఒక్కో ఎక్సలెన్సీ సెంటర్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా ఎంపీసీ, బైపీసీలకు 150 మంది చొప్పున ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 300 మందికి ప్రవేశం కల్పిస్తాం. ప్రవేశాల్లో బాలికలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఈ ఎక్సలెన్సీ సెంటర్ల నిర్వహణకు టెండర్లు పిలిచి అర్హత కలిగిన వారికి అప్పగిస్తాం. పర్యవేక్షణ మాత్రం ప్రభుత్వానిదే. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమని అందుకనుగుణంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ కి దీటుగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
Prajavartha Online Telugu News