-కడప, నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలకు 75, 25 చొప్పున అదనపు సీట్లు మంజూరు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య విస్తరణకు మరో కీలక ముందడుగు పడింది. 2026-27 విద్యా సంవత్సరానికి అదనంగా కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 75, నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 25 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ) మంజూరు చేసింది. దీంతో రాష్ట్రానికి మొత్తం 100 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్ఎంసీ తాజా అనుమతితో కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 175 నుంచి 250కు పెరిగింది. నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ల సంఖ్య 175 నుంచి 200కు చేరుకుంది. ఈ పెంపుతో రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, అధ్యాపక సిబ్బంది నియామకం, ఎన్ఎంసీ ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టిన చర్యల ఫలితంగానే ఈ అనుమతులు లభించాయని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు ఈ సందర్భంగా కడప, నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News