-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–2026) కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించడానికి జూలై 14, 2026 చివరి తేదీ అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు.
ఇప్పటికే ఎన్యుమరేషన్ ఫారాలు అందుకున్న ప్రతి ఓటరు తప్పనిసరిగా వాటిని పూర్తిగా నింపి, సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)కు లేదా సమీప బూత్ కేంద్రంలో జూలై 14వ తేదీలోపు సమర్పించాలని సూచించారు.
ఇంకా ఫారం అందని వారు తమ పరిధిలోని BLOను లేదా సమీపంలోని ప్రత్యేక శిబిరాలు లేదా సచివాలయంలో సంప్రదించి వెంటనే ఫారం పొందాలని కోరారు. అదేవిధంగా, ఇంటి వద్దకు వచ్చిన BLOలకు పూర్తిగా సహకరించి ఎన్యుమరేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక సమగ్ర సవరణ–2026 కార్యక్రమం ద్వారా ఓటర్ల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో కొనసాగడం లక్ష్యమని తెలిపారు. అందువల్ల ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఓటరు జూలై 14వ తేదీలోగా తమ ఎన్యుమరేషన్ ఫారాన్ని సమర్పించాలని కమిషనర్ కోరారు.
Prajavartha Online Telugu News