– విలువ ఆధారిత ఉత్పత్తులతో సుస్థిర వ్యాపారం
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధునిక జీవనశైలి నేపథ్యంలో సమతుల్య పోషకాహారానికి చిరుధాన్యాలు (మిల్లెట్స్) ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయని.. పీచుపదార్థం, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు సమృద్ధిగా ఉండే చిరుధాన్యాలు ఆరోగ్యకర జీవితానికి పునాదులు వేస్తున్నాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఈ నేపథ్యంలో చిరుధాన్యాల విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
కలెక్టర్ లక్ష్మీశ శనివారం గుంటుపల్లి రైజ్ కేంద్రంలో మిల్లెట్ ఫుడ్ ప్రొడక్ట్స్పై వర్క్షాప్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 80 మంది స్వయం సహాయక సంఘ మహిళలు పాల్గొనగా 9నట్జ్ (9Nutz Millets Pvt. Ltd.) సీఈవో వి.కీర్తన చిరుధాన్యాలతో తయారయ్యే విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. మెరుగైన ఉపాధి అవకాశాలకు ఇవి ఏవిధంగా సహాయపడుతున్నాయో వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నేటి జీవనశైలికి చిరుధాన్యాలే ఆరోగ్యానికి, ఆనందానికి, ఆర్థికాభివృద్ధికి చిరునామా అని నిపుణులు సూచిస్తున్న వేళ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఇటు ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి అటు అత్యుత్తమ ఉపాధికి బాటలు వేసుకోవాలని సూచించారు. రైజ్ కేంద్రంలో నిర్వహిస్తున్న వర్క్షాప్లు, శిక్షణ కార్యక్రమాల ద్వారా అనేక మంది మహిళలు ఇప్పటికే పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేశారని.. వీరిని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News