– ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఇక 3 రోజులే!
– క్షేత్రస్థాయిలో ఓటర్ల సేవలో అధికార యంత్రాంగం
– బీఎల్వోలు, ప్రత్యేక శిబిరాలు, హెల్ప్ డెస్కులు అందుబాటులో
– సర్ ప్రక్రియలో విజయం గమ్యానికి చేరువైన డిజిటైజేషన్
– 14,07,640 (82.15 శాతం) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఈ నెల 14వ తేదీతో గడువు ముగియనున్నందున, ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్లు తమ ఫారాన్ని బీఎల్వోకు తప్పనిసరిగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు. ఫారం సమర్పణలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా సహాయసహకారాలు అందించేందుకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు.
కలెక్టర్ లక్ష్మీశ శనివారం ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లిలో పర్యటించి సర్ ప్రక్రియ జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటైజేషన్ పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారంతో పాటు ఆదివారం కూడా సర్ ప్రత్యేక శిబిరాలు అందుబాటులో ఉంటాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందించడంతో పాటు ఫారాల సమర్పణలో సందేహాల నివృత్తి కోసం అధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉన్నారని చెప్పారు. ప్రతి ఓటరు ఈ ప్రక్రియలో భాగస్వామి కావడం ద్వారా ఓటర్ల జాబితా మరింత కచ్చితత్వంతో, దోష రహితంగా రూపొందించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. చివరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించి ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు.
కీలక మైలురాయిని దాటిన సర్ (82.15 శాతం డిజిటైజేషన్):
జిల్లాలో సర్ ప్రక్రియ విజయం గమ్యానికి చేరడంలో కీలకమైలురాయిని చేరుకుంది. 14,07,640 (82.15 శాతం) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయింది. తిరువూరు నియోజకవర్గంలో 1,84,365 (88.34 శాతం), విజయవాడ పశ్చిమ 1,98,187 (77.12 శాతం), విజయవాడ మధ్య 2,17,887 (78.43 శాతం), విజయవాడ తూర్పు 2,14,234 (79.42 శాతం), మైలవరం 2,40,411 (84.31 శాతం), నందిగామ 1,75,955 (84.81 శాతం), జగ్గయ్యపేట 1,76,601 (85.09 శాతం) ఫారాల డిజిటైజేషన్ పూర్తయింది.
Prajavartha Online Telugu News