– పొలం బాట పట్టి అన్నదాతలతో మాట కలిపిన కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం తిరువూరు మండలంలో పర్యటించారు. ఎరువులు, పురుగుమందుల దుకాణంతో పాటు బోర్డర్ చెక్ పోస్టును తనిఖీ చేసిన అనంతరం పంట పొలాల బాటపట్టారు. వామకుంట్ల గ్రామంలోని వరి నాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో ఆత్మీయంగా మాట్లాడారు. రైతుల నుంచి సాగు పరిస్థితులు, ప్రభుత్వ సేవలపై అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ సాగు విధానాలను పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు తమ సాగు అనుభవాలను కలెక్టర్తో పంచుకోగా, పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమతుల్య పోషక యాజమాన్యం, నీటి పొదుపు పద్ధతులు పాటించడం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారుల సలహాల మేరకు ముందుకు సాగాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
Prajavartha Online Telugu News