-జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలకు అవకాశం – అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా
-ప్రతి అర్హుడు ఓటరుగా నమోదు కావాలి –
-జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision–SIR–2026) కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీశ శుక్రవారం విజయవాడ కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అధికారికంగా విడుదల చేశారు.
* జిల్లాలో 15.89 లక్షల మంది ఓటర్లు నమోదు
ముసాయిదా ఓటర్ల జాబితా-2026 ప్రకారం జిల్లా జనాభా 24,45,334 కాగా, మొత్తం 15,89,731 మంది ఓటర్లు నమోదయ్యారు. వారిలో 7,71,648 మంది పురుషులు, 8,17,936 మంది మహిళలు, 147 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే అధికంగా నమోదవడం విశేషం. స్త్రీ-పురుష నిష్పత్తి 1060 కాగా, ప్రతి వెయ్యి మంది జనాభాకు 650 మంది ఓటర్లు ఉన్నారు.
* పిడబ్ల్యూడీ, సర్వీస్ ఓటర్ల వివరాలు
జిల్లాలో 13,755 మంది దివ్యాంగ (PwD) ఓటర్లు నమోదయ్యారు. అలాగే 367 మంది సర్వీస్ ఓటర్లు ఉండగా, వారిలో 337 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నారు.
* 1936 పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా జాబితా అందుబాటులో
ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నమోదు అధికారుల (ERO) కార్యాలయాలు, సహాయ ఎన్నికల నమోదు అధికారుల (AERO) కార్యాలయాలు, అలాగే 1,936 పోలింగ్ కేంద్రాల్లో ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచారు.
* క్లెయిమ్లు, అభ్యంతరాలకు నెల రోజుల గడువు
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ ముసాయిదా జాబితాలో పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులు అవసరమైతే జూలై 31 నుంచి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత బూత్ లెవల్ అధికారి (BLO), తహశీల్దార్, సహాయ ఎన్నికల నమోదు అధికారి (AERO), ఎన్నికల నమోదు అధికారి (ERO) కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
* నోటీసుల జారీ, అభ్యంతరాల పరిష్కారం సెప్టెంబర్ 28 వరకు
సవరణల ప్రక్రియలో భాగంగా జూలై 31 నుంచి సెప్టెంబర్ 28, 2026 వరకు నోటీసుల జారీ, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిశీలన, విచారణ, పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
* అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా
అన్ని అభ్యంతరాలు, క్లెయిమ్ల పరిష్కారం అనంతరం 2026 అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా అధికారికంగా ప్రచురించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు.
* 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి
18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఫారం-6తో పాటు Annexure-D సమర్పించి కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ప్రత్యేక సమగ్ర సవరణలో అవసరమైన వివరాలు సమర్పించని వారు లేదా సమర్పించిన వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. నోటీసు అందుకున్న వారు నిర్ణీత గడువులోపు అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాలని సూచించారు.
* గుర్తింపు కోసం 11 రకాల చెల్లుబాటయ్యే పత్రాలు
* ఓటరు నమోదు లేదా వివరాల ధృవీకరణ కోసం క్రింది పత్రాల్లో ఏదైనా సమర్పించవచ్చు.
* ప్రభుత్వం/పీఎస్యూ ఉద్యోగి లేదా పింఛనుదారుల ఐడీ / PPO
* 01-07-1987కు ముందు ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన గుర్తింపు పత్రం
* జనన ధ్రువీకరణ పత్రం
* పాస్పోర్ట్
* మెట్రిక్యులేషన్ లేదా విద్యా ధ్రువపత్రం
* శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం (PRC)
* అటవీ హక్కుల ధ్రువీకరణ పత్రం
* OBC / SC / ST కుల ధ్రువీకరణ పత్రం
* NRC (వర్తించే ప్రాంతాల్లో)
* కుటుంబ రిజిస్టర్
* ప్రభుత్వం జారీ చేసిన భూమి లేదా ఇంటి కేటాయింపు ధ్రువీకరణ పత్రం
నియోజకవర్గాల వారీగా సాధారణ ఓటర్లు
* తిరువూరు (ఎస్సీ): 1,95,574 మంది (పురుషులు – 96,252, మహిళలు – 99,316, థర్డ్ జెండర్ – 6)
* విజయవాడ పశ్చిమ: 2,35,721 మంది (పురుషులు – 1,15,786, మహిళలు – 1,19,902, థర్డ్ జెండర్ – 33)
* విజయవాడ సెంట్రల్: 2,59,092 మంది (పురుషులు – 1,25,076, మహిళలు – 1,33,967, థర్డ్ జెండర్ – 49)
* విజయవాడ తూర్పు: 2,49,985 మంది (పురుషులు – 1,21,442, మహిళలు – 1,28,522, థర్డ్ జెండర్ – 21)
* మైలవరం: 2,64,459 మంది (పురుషులు – 1,27,737, మహిళలు – 1,36,702, థర్డ్ జెండర్ – 20) — జిల్లాలో అత్యధిక ఓటర్లు నమోదైన నియోజకవర్గం.
* నందిగామ (ఎస్సీ): 1,91,709 మంది (పురుషులు – 92,883, మహిళలు – 98,818, థర్డ్ జెండర్ – 8)
* జగ్గయ్యపేట: 1,93,191 మంది (పురుషులు – 92,472, మహిళలు – 1,00,709, థర్డ్ జెండర్ – 10)
*నియోజకవర్గాల వారీగా సర్వీస్ ఓటర్లు
* తిరువూరు (ఎస్సీ) – 48 మంది
* విజయవాడ పశ్చిమ – 58 మంది
* విజయవాడ సెంట్రల్ – 67 మంది (జిల్లాలో అత్యధికం)
* విజయవాడ తూర్పు – 60 మంది
* మైలవరం – 43 మంది
* నందిగామ (ఎస్సీ) – 41 మంది
* జగ్గయ్యపేట – 50 మంది
ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా, తప్పులులేకుండా రూపొందించడమే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. భారత ఎన్నికల సంఘం 09-09-2025 తేదీ No.23/2025-ERS/Vol.II ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి
ప్రతి ఓటరు ముసాయిదా జాబితాలో తమ పేరు, చిరునామా, ఇతర వివరాలను తప్పనిసరిగా పరిశీలించి, అవసరమైన సవరణలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ విజ్ఞప్తి చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పాల్గొని జిల్లాకు పూర్తిస్థాయి, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం, బిజెపి ప్రతినిధిలు కె.గణేష్, పి.సురేష్ బాబు, బీఎస్పీ ఏ.పవన్ కుమార్, టిడిపి ప్రతినిధి వై.రామయ్య, వైయస్సార్సీపి ప్రతినిధి వై.ఆంజనేయ రెడ్డి, జెఎస్పి ప్రతినిధి జె.శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల సెక్షన్ డిప్యూటీ తహసిల్దార్లు అనూష్ కుమార్, రెడ్డి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News