-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రతను బలోపేతం చేసే దిశగా ఆగస్టు 1వ తేదీన విస్తృత స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. మొత్తం 2,24,793 మంది లబ్ధిదారులకు రూ.98.12 కోట్ల విలువైన సామాజిక పింఛన్లను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పథకం కింద ప్రతినెల మాదిరిగానే ఈసారి కూడా పింఛన్లను సమయానికి అందించేందుకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయ సిబ్బందికి అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఆగస్టు 1వ తేదీ ఉదయం నుంచే స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా పింఛన్లు అందజేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని మండలాలు మరియు పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు సకాలంలో పింఛన్లు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మొత్తం రూ.98,11,85,500 కోట్ల నిధులను పంపిణీకి సిద్ధం చేసి, పారదర్శకంగా, సమర్థవంతంగా కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచించారు. పింఛన్ల పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్న సిబ్బంది లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి, గౌరవంతో పింఛన్లు అందజేయాలని కలెక్టర్ సూచించారు. వృద్ధులు, వికలాంగులు మరియు ఇతర లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని తెలిపారు. పంపిణీ సమయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించి, ప్రతి లబ్ధిదారునికి పింఛన్ చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News