-96 మంది లబ్ధిదారుల రికార్డుల్లో భూమి స్వభావం సవరణ పత్రాలు అందచేత
-కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం. పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో భూ రికార్డు సరిచేసిన ధృవీకరణ పత్రాల పంపిణీ, స్వచ్ఛత కార్యక్రమాలపై దిశ నిర్దేశం చేయడం జరిగింది.
భూ రికార్డుల్లో గతంలో నమోదైన తప్పులను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత ఉన్న కేసుల్లో సత్వరమే సవరణలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కొవ్వూరు రెవెన్యూ డివిజన్ చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో వెబ్ల్యాండ్ రికార్డుల్లో భూమి స్వభావానికి సంబంధించి చేపట్టిన సవరణల వివరాలను సోమవారం ఆమె వెల్లడించారు.
చాగల్లు గ్రామంలోని సర్వే నంబర్ 464-2 నుంచి 621-5 వరకు ఉన్న సర్వే నంబర్లలో 96 మంది లబ్ధిదారులకు సంబంధించిన భూముల స్వభావాన్ని సరిచేయాలని ప్రతిపాదనలు అందినట్లు తెలిపారు. సంబంధిత రెవెన్యూ, సర్వే రికార్డులను పరిశీలించగా, గతంలో భూమి స్వభావం పొరపాటుగా నమోదైనట్లు గుర్తించినట్లు చెప్పారు. పరిశీలన అనంతరం నిబంధనల మేరకు అవసరమైన సవరణలకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
ఈ మేరకు మెట్ట భూమిగా నమోదైన భూములను పట్టా భూమిగా సవరించేందుకు కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కాకర ఆనందరావు ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
తదనుగుణంగా వెబ్ల్యాండ్ రికార్డుల్లోనూ అవసరమైన మార్పులు చేసినట్లు చెప్పారు. ఆగస్టు 22న కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన భూ సర్వే మేళాలో ఈ దరఖాస్తు లను పరిశీలించి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లాలోనూ రికార్డుల పరిశీలనకు ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లాలో భూ రికార్డుల్లో ఇలాంటి మార్పులు, చేర్పులు అవసరమైన సందర్భాలను గుర్తించి, సంబంధిత రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూమి హక్కులు, భూమి స్వభావం, వెబ్ల్యాండ్ నమోదులు తదితర అంశాల్లో ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి సవరణను నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మాత్రమే చేపట్టాలని స్పష్టం చేశారు. రికార్డుల సవరణలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశం జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కాకర ఆనందరావు, రాజమండ్రి ఆర్డీవో ఆర్ శివ రాముడు, చాగల్లు తహసిల్దార్ ఎమ్ మెరికమ్మ, రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారులు, సర్వే శాఖల అధికారులు , తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News