– కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మృతి చెందిన ఖైదీ మసాడ శ్రీను రవి @ శ్రీను @ రవి, తండ్రి పైడినాయుడు సంబంధిత బంధువులు/చట్టబద్ధ వారసులకు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని మంజూరు చేసినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ కీర్తి చేకూరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మృత ఖైదీకి సంబంధించిన చట్టబద్ధ వారసులు లేదా సంబంధిత బంధువులు గుర్తించబడలేదని మురమండ, దుళ్ల గ్రామాల్లో కడియం తహసీల్దార్ నిర్వహించిన విచారణలో వెల్లడైనట్లు నివేదిక అందిందన్నారు. అందువల్ల మృత ఖైదీకి తాము చట్టబద్ధ వారసులమని లేదా సంబంధిత బంధువులమని క్లెయిమ్ చేయదలచిన వారు, సదరు ఖైదీతో తమకున్న సంబంధాన్ని నిరూపించే మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యులు/చట్టబద్ధ వారసుల ధ్రువీకరణ పత్రం, గుర్తింపు – చిరునామా ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర సంబంధిత పత్రాలను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం, రాజమహేంద్రవరం నందు ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 7 రోజుల్లోగా సమర్పించాలని సూచించారు. అందిన క్లెయిమ్లపై సంబంధిత రెవెన్యూ అధికారుల ద్వారా విచారణ నిర్వహించి, క్లెయిమ్ చేసిన వ్యక్తి నిజమైన చట్టబద్ధ వారసుడు లేదా తదుపరి బంధువుగా నిర్ధారణ అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.5 లక్షల పరిహారాన్ని అర్హత కలిగిన వ్యక్తికి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
Prajavartha Online Telugu News