-రూ.10 లక్షల PMEGP రుణంతో మగ్గం వర్క్ యూనిట్ నిర్వహణ
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందడంతో పాటు, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఎక్స్అఫీషియో సెక్రటరీ వాకాటి కరుణ సూచించారు.
ఆమె మార్గదర్శకత్వంలో నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామంలోని ఆదర్శ పందలపారు గ్రామ సంఘం పరిధిలోని శ్రీరామదుర్గ సంఘం సభ్యురాలు జల్లేపల్లి లక్ష్మీ నాగ నిర్వహిస్తున్న మగ్గం వర్క్ యూనిట్ను అధికారులు ఫీల్డ్ విజిట్లో పరిశీలించారు.
ఈ సందర్భంగా సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఎక్స్అఫీషియో సెక్రటరీ వాకాటి కరుణ మాట్లాడుతూ, మహిళా సంఘాల సభ్యులకు రుణ సదుపాయాలు కల్పించడం మాత్రమే కాకుండా, ఆ రుణాలను ఆదాయాన్ని సమకూర్చే స్థిరమైన జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి మహిళా సభ్యురాలికి అవసరమైన మేరకు ACLP (Annual Credit Livelihood Plan) ప్రకారం సకాలంలో రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని, బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి రుణాలు, మహిళా పారిశ్రామికవేత్తల యూనిట్ల గ్రౌండింగ్పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అలాగే ప్రతి మహిళా సంఘ సభ్యురాలు ‘మన డబ్బులు–మన లెక్కలు’ యాప్ను తప్పనిసరిగా తన మొబైల్లో నమోదు చేసుకుని, తమ ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి పొందడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగి, ఆర్థికంగా స్వావలంబన సాధించేలా సెర్ప్ సిబ్బంది నిరంతరం మార్గదర్శకత్వం, సహకారం అందించాలని ఆమె స్పష్టం చేశారు.
జల్లేపల్లి లక్ష్మీ నాగ PMEGP పథకం ద్వారా రూ.10 లక్షల రుణం పొందుతూ మగ్గం వర్క్ యూనిట్ను నిర్వహిస్తున్నారు. ఈ యూనిట్ ద్వారా ఆమె స్వయంగా జీవనోపాధి పొందడంతో పాటు, మరికొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.
ప్రభుత్వ రుణ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇటువంటి యూనిట్లు దోహదపడు తున్నాయని అధికారులు తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
ఈ ఫీల్డ్ విజిట్లో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. నగేష్, అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ వై. సత్యం నాయుడు, డీపీఎం–ఎల్హెచ్ హేమంత్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News