-ఎంపీడీఓకు మెరుగైన వైద్యం కల్పించండి
-అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అనీ, ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని స్పష్టం చేశారు. గాలివీడు ఎంపీడీఓపై చోటు చేసుకున్న దాడి ఘటన గురించి అధికారులతో ఉప ముఖ్యమంత్రి చర్చించారు. కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎంపీడీఓకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు. జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్లా ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని… దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న అప్రజాస్వామిక దాడిపై విచారణ చేయడంతోపాటు ఎంపీడీఓ ఆరోగ్యం గురించీ వాకబు చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.
Prajavartha Online Telugu News