రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం “స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమం ప్రచార గోడ ప్రతులను జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించబడే “స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” శిబిరాల ద్వారా వైద్య సేవలు అందించ నున్నట్లు తెలిపారు. మహిళలకు అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్, రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రోమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు, క్షయ వ్యాధి స్క్రీనింగ్, పోషణ అభియాన్, తల్లి – బిడ్డ సేవలు, కిశోర బాలికల ఆరోగ్య పరీక్షలు, వయో వృద్ధుల ఆరోగ్య సేవలు, మానసిక వైద్య సేవలు, అలాగే ఆయుష్ వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్వో డా. కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ – రాష్ట్ర స్థాయి కార్యక్రమం విశాఖపట్నంలో జరగనున్నదని, అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ పాల్గొంటారని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం పి హెచ్ సీ లో సెప్టెంబర్ 17 ఉదయం జరిగే ప్రారంభ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఇతర వైద్య ఆరోగ్య అధికారులు, తదితరులు హాజరుకానున్నారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కే వెంకటేశ్వర రావు, సిపివో ఎల్ అప్పల కొండ, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవ రావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News