-ఫోన్ కాల్ ద్వారా జిల్లా కలెక్టర్ కు మంత్రి కందుల దుర్గేష్ సూచన
-ఎర్రకాలువ ముంపు గురికాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, పంట నష్టపోకుండా రైతాంగానికి మార్గదర్శకత్వం అందించాలని మంత్రి దుర్గేష్ ఆదేశాలు జారీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం: ‘మొంథా’ తుఫానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా “మొంథా” తుఫాన్ పై ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ ఫోన్ కాల్ ద్వారా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి సూచించారు. తుఫాన్ ప్రభావం, తీవ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా జిల్లా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిత్యావసర వస్తువులకు, తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రకృతి విపత్తుల వల్ల ఎర్రకాలువ ముంపుకు పంట నష్టపోకుండా రైతాంగాన్ని అప్రమత్తం చేయాలని, ఎర్రకాలువ గట్లు తెగకుండా పటిష్ట పరిచేందుకు ముందస్తుగా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా రోడ్లు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురికాకుండా అవసరమైన మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.
Prajavartha Online Telugu News