-మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
-ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లాకు వొచ్చిన ఆరోగ్య కమిషనర్ వీర పాండ్యన్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బాధితులకు పూర్తి వైద్య ఖర్చులు భారం ప్రభుత్వం భరిస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి, ధైర్యం కల్పించడం జరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ జి. వీర పాండ్యన్ తెలిపారు. సోమవారం కిమ్స్ , రెయిన్బో ఆసుపత్రులను ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండ్యన్, ఎస్పీ డి నరసింహ కిషోర్ తదితరులతో కలిసి కలెక్టర్ పర్యటించడం జరిగింది. రాజమహేంద్రవరంలో ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందనీ ఆయన తెలిపారు.
ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను నియమించి, పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. కారణాలపై సాంకేతిక నిపుణుల కమిటీ పరిశీలన కొనసాగు తోందన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా బాధితులకి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంలో ఆరోగ్య శాఖ కమిషనర్ జి. వీర పాండ్యన్, ఐజీ జివి అశోక్ కుమార్, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి. నరసింహ కిషోర్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా రేయిన్బో మరియు కిమ్స్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులను పర్యవేక్షించి ధైర్యం చేకూరించారు. పలుసార్లు ఆసుపత్రులను సందర్శించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియ చేశారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఏదైనా సహాయం కావాలన్న, ఫిర్యాదుల కోసం హెల్ప్లైన్ నెంబర్ 9494060060 ను సంప్రదించవచ్చు అని తెలియ చేశారు.
Prajavartha Online Telugu News