-ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిషనర్ ధ్యానచంద్ర నిరంతర పర్యవేక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం సాయంత్రం నగరంలో కురిసిన వర్షాలు, ఈదురు గాలుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖాధిపతులతో వైర్లెస్ సెట్ ద్వారా నిరంతరం సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలలో రోడ్లపై నీరు నిల్వ ఉండే పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఇంజినీరింగ్, పారిశుద్ధ్య విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నీరు నిల్వ లేకుండా తక్షణ చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే కూడళ్ల వద్ద ప్రత్యేక దృష్టి సారించి మోటార్లు, డ్రైనేజీ వ్యవస్థలను వినియోగించి నీటిని తొలగించే చర్యలు కొనసాగించారు.
మరోవైపు ఈదురు గాలుల ప్రభావంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో హోర్డింగులు, ఫ్లెక్సీలు, చెట్ల కొమ్మలు కూలిన ఘటనలను అధికారులు వెంటనే గుర్తించి, ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా తొలగింపు చర్యలు చేపట్టారు. ప్రమాదకర పరిస్థితులు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను అప్రమత్తం చేశారు.
నగరంలో పడిపోయిన చెట్లు, విరిగిన కొమ్మలను తొలగించేందుకు విఎంసీకి చెందిన జేసీబీలతో పాటు అదనంగా ప్రైవేటు జేసీబీలను కూడా వినియోగంలోకి తీసుకువచ్చి, ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా వేగంగా తొలగింపు పనులు చేపట్టాలని కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు.
అత్యవసర పరిస్థితులపై అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు.
Prajavartha Online Telugu News