గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి అధ్యయనం నిర్వహిస్తున్న డెడికేషన్ కమిషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా బుధవారం గుంటూరులోని ఎస్.ఆర్. శంకరన్ హాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీసీ సంఘాలు మరియు వివిధ వర్గాల నుంచి వినతులు, సూచనలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల కల్పన, బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత, స్థానిక పాలనలో వారి ప్రాతినిధ్యం పెంపు తదితర అంశాలపై అభిప్రాయాలను సేకరించారు. వివిధ వర్గాల నుంచి అందిన వినతులు, సూచనలను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు చైర్మన్ తెలిపారు.
ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా సమర్పించి స్థానిక సంస్థలలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర నివేదిక రూపొందించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని చైర్మన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డి ఆర్ ఓ ఖాజావలి, ఆర్ డి ఓ శ్రీనివాస రావు, జిల్లా బి సి వెల్ఫేర్ అధికారి మయూరి, జడ్పీ సీఈవో జ్యోతి బసు , ఇతర శాఖల జిల్లా అధికారులు, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మున్సిపల్ కమీషనర్లు, యం పి డి ఓ లు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News