-మలిదశ వయసులో ఉపాధ్యాయులకు ఈ టెట్ కష్టాలు ఏమిటి…? విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకోవాలి..ఎస్ టి యు డిమాండ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థుల బోధనకు అంతరాయం లేకుండా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహణపై ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి లంకలపల్లి సాయిశ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల వయస్సును దృష్టిలో ఉంచుకొని అలాగే విద్యార్థుల బోధనకు అంతరాయం లేకుండా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఆఫ్ లైన్ పరీక్ష నిర్వహించాలని అలాగే ఉత్తీర్ణతలో కనీస అర్హత మార్కులను తగ్గించాలని విద్యాశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. సి బి టి పద్ధతిలో పరీక్ష నిర్వహించాలంటే రోజుల తరబడి సమయం అవసరమని కనుక ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఆఫ్ లైన్లో నిర్వహించడం వలన పరీక్షా కేంద్రాలు కూడా సౌలభ్యంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. దూర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయిస్తే ఉపాధ్యాయులకు తీవ్ర భారంగా ఉంటుందని కనుక ఈ దశలో నిర్ణయం తీసుకొని ఉపాధ్యాయులకు మేలు చేయాలని కోరారు. పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు ఓ.డీ సౌకర్యమైన లేక సెలవు దినాలల్లో నిర్వహించేలా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మలి వయసులో ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతిపాదనలను అంగీకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News