-ఎస్.ఐ.ఆర్ మ్యాపింగ్ పక్కాగా చేయాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హత కలిగిన ప్రతి ఓటరు వాటర్ జాబితాలో ఉంటారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ అన్నారు. ఓటరు ప్రత్యేక సవరణ (ఎస్.ఐ.ఆర్) కార్యక్రమంలో భాగంగా గృహ మ్యాపింగ్ పక్కాగా చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశించారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను గుంటూరు పట్టణం పశ్చిమ నియోజక వర్గం శాంతి నగర్ 181 పోలింగ్ కేంద్రం, అంకమ్మ నగర్ 179 పోలింగ్ కేంద్రాల పరిధిలో గురువారం సి.ఇ.ఓ పరిశీలించారు. బూత్ లెవెల్ అధికారులతో మాట్లాడి, ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను ఏ విధంగా చేపడుతున్నది తెలుసుకున్నారు. అనంతరం గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో ఎ.ఇ.ఆర్ లతో చర్చించారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అపార్టుమెంట్ల వద్ద ఓటరు నమోదుకు అపార్టుమెంట్ల సంఘాలతో సమన్వయంతో పనిచేసి ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. బూత్ స్థాయి అధికారి తో “బుక్ ఎ కాల్” వ్యవస్థ ద్వారా ఓటర్ల సందేహాలను నివృత్తి చేయుటకు కృషి చేయాలన్నారు. ఎస్.ఐ.ఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యక్షంగా లేనివారు (ఆబ్సెంట్), ఇతర ప్రాంతాలకు వెళ్ళినవారు (షిఫ్టెడ్), మరణించినవారు (డెడ్), డూప్లికేట్, ఇతర దేశస్థులు (ఫారినర్ లు) క్రింద ఉన్న ఓటర్లు మినహా అందరూ ఓటరు జాబితాలో ఉండాలని అన్నారు. ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందించాలని చెప్పారు.
గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమ చేపడుతున్నామని వివరించారు. ప్రక్రియ వేగవంతం చేయుటకు బూత్ స్థాయి అధికారికి సహాయకులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ జి.సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News