గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను వెనక్కి తీసుకొని, వాటిని డిజిటలైజేషన్ చేయడానికి బిఎల్ఓల వారీగా రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఏఈఆర్ఓలతో ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏఈఆర్ఓలు క్షేత్ర స్థాయిలో ఎన్యూమరేషన్ ఫారాలను నింపి వెనక్కి తీసుకోవడం, 2002 ఓటర్ల లిస్ట్ తో మ్యాపింగ్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెండు నియోజకవర్గాల్లో ఇప్పటికే బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు షుమారు 98 శాతానికి పైగా పంపిణీ చేశారని, వాటిని డిజిటలైజేషన్ కు స్పెషల్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలన్నారు. ఏరోజుకు ఆరోజు అందిన ఫారాలను అదే రోజు డిజిటలైజేషన్ చేసేలా చూడాలన్నారు. సర్ ప్రక్రియ ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ జూలై 14 నాటికి పూర్తీ చేసి, 21న డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అవుతుందని, కనుక ప్రతి రోజు ముఖ్యమైనదేనన్నారు. ఎన్నికల విధులు అత్యంత ప్రాధాన్యత కల్గినవని, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. బిఎల్ఓలు ఫీల్డ్ లో లేకుంటే రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఏఈఆర్ఓలకు జిఎంసి నుండి నియమించిన సూపర్వైజరీ అధికారులు సమన్వయం చేసుకుంటారని, ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి తీసుకోవడంలో బిఎల్ఏల సహకారం తీసుకోవచ్చని పేర్కొన్నారు.
సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ జి.సాంబశివరావు, ఏఈఆర్ఓలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News