-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత
-సీమ అంతటా పారిశ్రామిక ప్రగతి
-స్టీల్ ప్లాంట్ తో వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి
-ఓర్వలేక జగన్ డైవర్షన్ పాలిటిక్స్
-కూల్చడాలు, దోపిడిలే జగన్ క్రెడిట్
-ఆ క్రెడిట్ మాకవసరం లేదు : మంత్రి సవిత
-జమ్మలమడుగు స్టీల్ ప్లాంట్ ప్రారంభ పనుల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత
జమ్మలమడుగు/కడప, నేటి పత్రిక ప్రజావార్త :
రాయలసీమలో పరిశ్రమలు నెలకొల్పుతూ, ఈ ప్రాంత యువత ఉజ్వల భవిష్యత్తుకు సీఎం చంద్రబాబునాయుడు పునాదులు నిర్మిస్తున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత తెలిపారు. జమ్మలమడుగులో ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ తో యువతకు ఉపాధి లభించడమే కాకుండా ఈ ప్రాంత రూపురేఖలే మారనున్నాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో సీఎం చంద్రబాబునాయుడుకు వస్తున్న పేరు ప్రఖ్యాతలను చూసి, జగన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రజలను డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని, ఆయనకున్న క్రెడిట్ ఏంటో ప్రజలందరికీ తెలుసని విమర్శించారు. జమ్మలమడుగులోని సున్నపురాళ్లపల్లె వద్ద రూ.16,350 కోట్లతో శుక్రవారం చేపట్టబోయే స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల ఏర్పాట్లను ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, పుత్తా కృష్ణా చైతన్యరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేశ్ రెడ్డి, ఇతర కూటమి నేతలతో కలిసి జిల్లా ఇన్చార్జి మంత్రి గురువారం పరిశీలించారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో జిల్లా ఇన్చార్జి మంత్రి మాట్లాడారు. రాయలసీమలోని అన్ని ప్రాంతాలను సీఎం చంద్రబాబునాయుడు అభివృద్ధి చేస్తున్నారన్నారు. పరిశ్రమలను ఏర్పాటు చేయడమే కాకుండా సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారన్నారు. ముఖ్యంగా రాయలసీమలోని కర్నూలు, చిత్తూరు, కడప సహా అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ, ఈ ప్రాంత యువతకు ఉజ్వల భవిష్యత్తు అందజేస్తున్నారన్నారు. జమ్మలమడుగులోని సున్నపురాళ్లపల్లె వద్ద రూ.16,350 కోట్లతో శుక్రవారం చేపట్టబోయే స్టీల్ ప్లాంట్ తో వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందన్నారు.
జగన్ క్రెడిట్ మాకొద్దు
జగన్ రెడ్డికి ఉన్న క్రెడిట్ ఏంటో ప్రజలందరికీ తెలుసని, ఆ క్రెడిట్ ను చోరీ చేయాల్సిన దుస్థితి తమకు పట్టలేదని మంత్రి సవిత తెలిపారు. ప్రజా వేదికను కూల్చివేయడం, అన్న క్యాంటీన్లు మూసివేసి పేదల కడుపు కొట్టడం, దోచుకోవడం ఇవే జగన్ క్రెడిట్ అని విమర్శించారు. అయిదేళ్లలో ఒక్క పరిశ్రమను జగన్ ఏర్పాటు చేయలేదన్నారు.జే ట్యాక్స్ పేరుతో ఉన్న పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారన్నారు. ఏయే పరిశ్రమలు తీసుకొచ్చావో జగన్ చెప్పాలని తమ మంత్రి నారా లోకేశ్ ఎన్నో పర్యాయాలు కోరినా, వైసీపీ నుంచి స్పందన లేదన్నారు. రాష్ట్రంలో ఒకవైపు పరిశ్రమలు ఏర్పాటు, మరోవైపు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో సీఎం చంద్రబాబుకు వస్తున్న మంచిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారన్నారు. ఒకరోజు శవ రాజకీయాలు, మరో రోజు డీఎస్సీ నిర్వహణపై ఆరోపణలు, ఇంకో రోజు మహిళల కట్టుబొట్టుపై విమర్శలు చేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి జగన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2018లోనే రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబునాయుడు చర్యలు చేపట్టారన్నారు. అంతకుముందు స్టీల్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ ఏర్పాట్లను, హెలీ ప్యాడ్ ను జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత పరిశీలించారు. సభకు పెద్ద ఎత్తున జనాలు తరలొచ్చే అవకాశముందని, ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగుగుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు.
Prajavartha Online Telugu News