-డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి
-పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ని సద్వినియోగం చేసుకోవాలి
-గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్వో, నగర కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్దేశిత గడువు జూలై 14 కంటే ముందుగానే పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఈఆర్ఓ), నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శనివారం ఆకులవారితోటలోని ఇరిగేషన్ కార్యాలయం, నేతాజీ నగర్, వెంగళరావు నగర్ ల్లోని పోలింగ్ కేంద్రాల ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల, స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని గడువులోగా పూర్తి చేసేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఎందుకంటే గడువు 15వ తేదీ నాటికి ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా లేదా ఫారాలను అందరూ ఒక్కసారిగా తీసుకురావడం వలన వాటిని డిజిటలైజేషన్ చేయలేకపోతే ఈ నెల 21న విడుదుల అయ్యే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ లో ఓటర్ గా పేరు ఉండదు కనుక గడువు కంటే ముందుగానే ఫారాలను అందిస్తే వాటిని ఏరోజుకు ఆరోజు డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందన్నారు. కనుక ఓటర్లు కూడా తమకు అందిన ఎన్యూమరేషన్ ఫారాలను నింపి బిఎల్ఓలకు అందించాలని కోరారు. బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను పక్కాగా నిర్వహిస్తూ, ఓటర్ల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి ఫారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) బీఎల్వోలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఓటర్లు ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.అదేవిధంగా, 2002 సంవత్సరంలో ఓటరు నమోదుకు సంబంధించిన వివరాలు ఉంటే వాటిని సిద్ధంగా ఉంచుకోవాలని, లేకపోతే తల్లిదండ్రులు లేదా అవ్వ, తాత, నాన్నమ్మలలో ఎవరిదైనా ఓటు ఏ రాష్ట్రం, నియోజకవర్గం, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్లో నమోదై ఉందో ఆ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
పర్యటనలో ఏఈఆర్ ఉమామహేశ్వరరావు, సూపర్వైజరీ అధికారులు పోలేశ్వరరావు, ఉదయరంగా, రాజేష్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News